నెల్లికుదురు, డిసెంబర్ 23 : ఒకప్పుడు సర్కారు పాఠశాలలంటే చిన్నచూపు.., శిథిలావస్థలో భవనాలు, అరకొర వసతులు, తాగునీటికి కష్టాలు, మరుగుదొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందిపడేవారు. నిధుల లేమితో నిర్వహణ సరిగ్గా ఉండక ప్రభుత్వ పాఠశాలలంటేనే భయపడేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. స్వరాష్ట్రంలో అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ విద్యను తలదన్నేలా సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నది. పాఠశాలల పనిదినాల్లో రోజువారీ ఖర్చులు, కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు, విద్యార్థులకు రవాణా భత్యం, మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణ, మరుగుదొడ్ల నిర్మాణం తదితరాల కోసం ఏటా క్రమం తప్పకుండా నిధులిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కరోనాతో పాఠశాలలు సెప్టెంబ ర్ నెలలో ప్రారంభంగా కాగా, నిర్వహణ కోసం నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 60 ఎమ్మార్సీలు, 233 కాంప్లెక్స్లు, 3,181 బడులున్నాయి. ఇందులో పాఠశాలల నిర్వహణ (స్కూల్ గ్రాంట్)కు రూ.3,63,47, 500, ఎమ్మార్సీలకు రూ. 24,60,600, కాంప్లెక్స్లకు రూ.38,44,500 నిధులు మంజూరు చేసింది.
పాఠశాలల పనిదినాల్లో రోజువారీ ఖర్చులు, సమావేశాల నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం ఎస్ఎంసీ ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఉమ్మడి జిల్లాలో 3,181 పాఠశాలలుండగా, మొదటి విడుతలో రూ.3,63,47, 500 మంజమంజురయ్యాయి. జనగామ జిల్లాలో 469 పాఠశాలలకు రూ.58,77,500, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 417 పాఠశాలలకు రూ.43,52,500, మహబూబాబాద్ జిల్లాలో 846 పాఠశాలలకు రూ.89,67, 500, ములుగు జిల్లాలో 407 పాఠశాలలకు రూ.39.50లక్షలు, వరంగల్ జిల్లాలో 592 పాఠశాలలకు రూ.68.20 లక్షలు, హనుమకొండ జిల్లాలో 450పాఠశాలలకు రూ. 63.80లక్షలు సంబంధిత పాఠశాలల ఎస్ఎంసీ బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి.
ఉమ్మడి జిల్లాలో 60విద్యా వనరుల కేంద్రాలు(ఎమ్మార్సీలు) ఉన్నాయి. ఆయా మండలాల్లోని పాఠశాలలన్నీ వీటి పరిధిలోనే పని చేస్తాయి. మండల విద్యాశాఖ అధికారి మండలంలోని పాఠశాలలను నిత్యం పర్యవేక్షిస్తూ చదువులు సక్కగాసాగేలా చర్యలు తీసుకుంటా రు. వీటి నిర్వహణ కోసం ఒక్కో మండల విద్యావనరు ల కేంద్రానికి రూ.45 వేల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జనగామ జిల్లాలోని పది ఎమ్మార్సీలకు రూ.4.50లక్షలు, జయశంకర్ జిల్లాలో 9ఎమ్మార్సీలకు రూ.4.5 లక్షలు, మహబూబాబాద్ జిల్లాలోని 12 ఎమ్మార్సీలకు రూ.5.40లక్షలు, ములుగు జిల్లాలో 8 ఎమ్మార్సీలకు రూ.3.60లక్షలు, వరంగల్ జిల్లాలో 14 ఎమ్మార్సీలకు రూ.6.30 లక్షలు, హనుమకొండ జిల్లాలోని 7 ఎమ్మార్సీలకు రూ.3. 15లక్షల నిధులు ఎమ్మార్సీ బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి.
ఉమ్మడి జిల్లాలో 233 పాఠశాలల సముదాయాలు(కాంప్లెక్స్) ఉన్నాయి. ఒక్కో కాంప్లెక్స్ నిర్వహణకు మొదటి విడుతగా రూ. 16,500 చొప్పున నిధులు మంజూరు చేసింది. జనగామ జిల్లాలో 35 కాంప్లెక్స్లకు రూ.5,77,500, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 28 కాంప్లెక్స్లకు రూ. 4.62 లక్షలు, మహబూబాబాద్ జిల్లాలో 60 కాంప్లెక్స్లకు రూ. 9.90 లక్షలు, ములుగు జిల్లాలోని 30 కాంప్లెక్స్లకు రూ. 4.95 లక్షలు, వరంగల్ జిల్లాలోని 44 కాంప్లెక్స్లకు రూ. 7.26లక్షలు, హనుమకొండ జిల్లాలోని 36 కాంప్లెక్స్లకు రూ.5.94లక్షలు నిధులు మంజూరయ్యాయి.