మహబూబాబాద్ : ఏకాగ్రత, పట్టుదలతో పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి అని జిల్లా కలెక్టర్ కె. శశాంక నిరుద్యోగ యువతకు సూచించారు. సోమవారం స్థానిక అను బాలాజీ ఫంక్షన్ హాల్లో జిల్లాలోని నిరుద్యోగ యువతకు గ్రూప్ -1, 2, 3, 4, ఎస్సై, కానిస్టేబుల్ ప్రభుత్వ పోటీ పరీక్షలకు టి.ఆర్.ఆర్. చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమం పై ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ కె.శశాంక అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతం తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రెసిడెన్షియల్ ఆర్డరు ప్రకారం మన ఉద్యోగాలు మనకే లభించడంతో పాటు, ఏ జిల్లా వాసులు ఆ జిల్లాలోనే ఉద్యోగం పొందే అవకాశం ఏర్పడిందన్నారు.
పోటీ పరీక్షలలో నిరుద్యోగ యువత ఉత్తీర్ణత సాధించడానికి జిల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఏ ఉద్యోగం సాధించాలి అనే విషయమై క్లారిటీ ముందుగా ఏర్పరచుకొని, అందుకు తగ్గట్లుగా శ్రమించాలి అని అప్పుడే విజయం లభిస్తుందన్నారు.శిక్షణ మాత్రమే ఉచితం అని కష్టపడడడం మాత్రం మీ మీదనే ఆధారపడి ఉందన్నారు. కార్యక్రమంలో తక్కెళ్లపల్లి యశ్వంత్ రావు, ఐ.సి.ఎల్.ఎస్., తక్కెళ్లపల్లి దుష్యంత్ రావు, విద్యా సంస్థల ప్రతినిధులు, నిరుద్యోగ యువత, తదితరులు పాల్గొన్నారు.