మండల ప్రత్యేక అధికారి సయ్యద్ ఖుర్షీద్
డోర్నకల్, ఏప్రిల్ 30 : కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని మండల ప్రత్యేక అధికారి సయ్యద్ ఖుర్షీద్ సూచించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి శుభకార్యాలకు అనుమతి లేదన్నారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాలని, లేకుంటే రూ 1,000 జరిమానా విధిస్తామన్నారు. అనంతరం గ్రామా ల్లో 6 సభ్యులతో టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించారు. ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వివేక్, సీఐ ఇస్లావత్ శ్రీనివాస్, డాక్టర్ వీరాజిత, సీడీపీవో ఇందిర, ఎంపీవో బేగ్, సీహెచ్వో వీరాబాబు పాల్గొన్నారు.
డోర్నకల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 365 మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రంజిత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ఆవరణంలో 60 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 14 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
మండల పరిధిలోని తెల్లబండతండా పంచాయతీలో సర్పంచ్ శ్రీనివాస్ నాయక్ శుక్రవారం బ్లిచింగ్, సోడి యం హైపొక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు 17 రోజులు పాటు, హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు.
కరోనా పాజిటివ్ వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి..
కురవి మండలంలోని బలపాల, కురవి పీహెచ్సీ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు జితేందర్, శ్వేతలు సూచించారు. బలపాలలో 35 మంది కి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 13 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. కురవి పీహెచ్సీలో 30 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 9 మందికి పాజిటివ్గా వచ్చినట్లు వైద్యురాలు శ్వేత తెలిపారు. పాజిటివ్ వ్యక్తులు తప్పనిసరిగా 17 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్..
మండలంలోని బలపాల, కురవి పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. శుక్రవారం కురవి ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రంలో 251 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యురాలు శ్వేత తెలిపారు. బలపాల పీహెచ్సీ సెంటర్లో 153 మందికి వాక్సి న్లు పంపిణీ చేసినట్లు వైద్యుడు జితేందర్ తెలిపారు.
శానిటైజర్ బాటిల్స్, మాస్క్లు, సబ్బులు పంపిణీ
గంగారం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలకు మహబూబాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు శానిటైజర్, మాస్క్లు, సబ్బులను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎం వెంకట్, డీటీ నరేశ్, సీనియర్ అసిస్టెంట్ నాగన్న, డాక్టర్ ముకరం, ఏఎన్ఎం పాల్గొన్నారు.