, జూన్15 : ఈటల రాజేందర్ ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తాడో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మండలంలోని గోపాల్పూర్, శనిగరం, మాధన్నపేట, గూనిపర్తి, శ్రీరాంలపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈటలకు సీఎం కేసీఆర్ ఏం తక్కువ చేశాడని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడో ప్రజలకు చెప్పాలన్నారు.
ఈటల ఎందుకు రాజీనామా చేయాల్సివచ్చిందో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలన్నారు. భూకబ్జా ఆరోపణలు నిరూపించుకోకుండా ఆస్తులు కాపాడుకోవాలనే బీజేపీలో చేరినట్లు విమర్శించారు. పదవులను అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన ఆస్తిని ఎలా కాపాడుకోవాలని చూశావే తప్ప.. ప్రజలకోసం ఏనాడైనా పనిచేశావా అని ప్రశ్నించారు. మతతత్వ పార్టీ అంటూ నిత్యం బీజేపీపై దుమ్మెత్తి పోసిన ఈటల ఆత్మాభిమానం చంపుకొని ఆ పార్టీలో చేరడం సిగ్గుచేటన్నారు. ప్రపంచంలో ఏదేశంలో లేనివిధంగా రైతుబంధు పథకాన్ని అమలు చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా రూ.లక్షా116 ఇస్తుంటే సంక్షేమ పథకాలను అవహేళన చేసినట్లు మాట్లాడం సరికాదన్నారు.
గ్రామాల్లో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మూడు నెలల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్కు అండగా నిలువాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలయ్యే వరకు కమలాపూర్ బాధ్యతలను ముఖ్యమంత్రి తనకు అప్పగించారని, మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని వెల్లడించారు. అనంతరం శనిగరం గ్రామానికి చెందిన పల్లె అంజిరెడ్డి, కాంగ్రెస్ వంగపల్లి గ్రామ అధ్యక్షుడు చిలువేరు జగదీశ్, పలు గ్రామాల వార్డు సభ్యులు, 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు లడె గోపాల్, పింగిళి రవళీరంజిత్రెడ్డి, కంచనకుంట్ల విజేందర్రెడ్డి, పెండ్యాల రవీందర్రెడ్డి, వరంగల్ ఏఎంసీ చైర్మన్ చింతం సదానందం, మండల ఇన్చార్జి రవీందర్రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి, నాయకులు ప్రదీప్రెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.