ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
హన్మకొండ, మే 30 : కరోనా కట్టడికి దాతలు ముందుకొచ్చి చేయూతనివ్వడం అభినందనీయమని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఆదివారం ఆయన వరంగల్ అర్బన్ రెడ్క్రాస్ సొసైటీకి ఎన్ఆర్ఐలు ఇచ్చిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రారంభించి మాట్లాడారు. కరోనా విపత్తు సమయంలో రెడ్క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. రక్తానికే పరిమితం కాకుండా వివిధ కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. తాను కూడా రెడ్క్రాస్ సభ్యుడిగా ఉండడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. కరోనా బాధితుల కోసం ఐదు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన దాతలు వంశీరెడ్డి (వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధి), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ల సేవలను కొనియాడారు. కరోనా బాధితుల కోసం డెట్రాయిట్, మిచిగాన్, అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ ఎం.సుదర్శన్రెడ్డి రూ.లక్షా 75వేల విలువైన మెడికల్ కిట్స్ అందించడం వారి దాతృత్వానికి నిదర్శమన్నారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ పాలక వర్గాన్ని వినయ్భాస్కర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పీ విజయచందర్రెడ్డి, రాష్ట్ర ఎంసీ మెంబర్ ఈవీ శ్రీనివాసరావు, జిల్లా సభ్యులు డాక్టర్ టీ విజయలక్ష్మి, బాశెట్టి హరిప్రసాద్, రెడ్క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.