హన్మకొండ, మే 21: వరంగల్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు శుక్రవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని హెలీప్యాడ్ వద్ద మంత్రులు, ఎంపీలు, చీఫ్విప్, జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. సీఎం ఉదయం 11 గంటలకు చేరుకోవాల్సి ఉండగా 12.20 గంటలకు ఆర్ట్స్ కళాశాలకు చేరుకున్నారు. అక్కచి నుంచి నేరుగా వరంగల్ ఎంజీఎం దవాఖానకు వెళ్లారు. కాగా, ఆర్ట్స్ కళాశాల హెలీప్యాడ్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరినీ కళాశాలోకి అనుమతించలేదు. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు, పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు ఉన్నారు. కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం సాయం త్రం 5.20 గంటలకు సీఎం కేసీఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెలీప్యాడ్ నుంచి హైదరాబాద్కు తిరుగు పయణమయ్యారు.
కెప్టెన్ ఇంట్లో మధ్యాహ్న భోజనం
ఎంజీఎం దవాఖానలో పర్యటించిన సీఎం కేసీఆర్ నేరుగా 1.30 గంటలకు హన్మకొండ హంటర్రోడ్డులోని కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి చేరుకున్నారు. సీఎంకు కెప్టెన్ కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిథులతో కలిసి భోజనం చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన పలువురు ప్రజాప్రతినిధులతో కొంత సేపు ముచ్చటించారు. అక్కడి నుంచి 2.50 గంటలకు బయలుదేరి నేరుగా సెంట్రల్ జైలకు వెళ్లారు. కెప్టెన్ ఇంటి చుట్టూ, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏ ర్పాటు చేశారు. అనుమతి ఉన్న ప్రజాప్రతినిధులను తప్ప కెప్టెన్ ఇంట్లోకి ఎవరినీ అనుమతించలేదు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, జడ్సీ చైర్మన్లు సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
సీఎస్ను కలిసిన కలెక్టర్లు
హన్మకొండ, మే 21: సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా హన్మకొండకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్కు కలెక్టర్లు, అధికారులు శుక్రవారం హరిత కాకతీయ హోటల్లో స్వాగ తం పలికారు. వీరిలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీహన్మంతు, ఎం హరిత, వరంగల్ అర్బన్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా ఇన్చార్జి డీఆర్వో వాసుచంద్ర తదితరులున్నారు.