ప్రజల్లో పెరిగిన చైతన్యం
కరోనాతో జనంలో వస్తున్న మార్పు
తొర్రూరు, మే 18 : కరోనా రెండో దశ వ్యా ప్తితో ప్రజల్లో ఆందోళన, భయం అమాం తం పెరిగాయి. మారుమూల పల్లెలు, గూడేలనూ వైరస్ వదల్లేదు. ఫస్ట్ వేవ్లో పెద్దగా ప్రభా వం చూపకపోయినా సెకండ్ వేవ్తో కళ్ల ముందే తీవ్రమైన ఘటనలు జరుగుతుండడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. ఆప్తులు దూరమవుతుండడంతో ఏమీలేక నిశ్చేష్టులైన తీరు.. మెల్లిమెల్లిగా ఆలోచింపజేసింది. ఇదివరకు చేసిన పొరపాట్లు మళ్లీ జరుగకుండా జాగ్రత్తలు పడుతూనే కరోనా దరిచేరకుండా అప్రమత్తమవుతున్నారు. ఎవరిని చూసినా మాస్కు ధరించడం, ఏ పనికి వెళ్లినా భౌతిక దూరాన్ని పాటించడం అలవాటు చేసుకుంటూ చైతన్యవంతులయ్యారు. మాస్కుల వినియోగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు.. అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడంతో అందరిలోనూ అవగాహన పెరిగింది. ప్ర స్తుతం అమలవుతున్న లాక్డౌన్లో పక్కా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం కన్పిస్తున్నది. అనవసరంగా వీధుల్లోకి పెద్దగా ఎవరూ రావడం లేదు.
పల్లెల్లో వైరస్ దరిచేరకుండా..
పల్లె ప్రగతితో మారిన పల్లె వాతావరణం, పారిశుధ్య కార్యక్రమాలు.. ఇప్పుడు కరోనా కట్టడికి దోహదం చేస్తున్నాయి. అన్ని పంచాయతీలు, ఆవాస ప్రాంతాల్లో సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం, బ్లీచింగ్, పంచాయతీ ట్రాక్టర్లలో చెత్తను తరలిస్తూ వైరస్ను దరిచేరనివ్వడం లేదు. ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఆరోగ్య సర్వే, స్వల్ప లక్షణాలున్న వారికి కరోనా మందుల కిట్ అందజేత, ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఓపీ సేవలు కరోనా నియంత్రణలోకి రావడానికి ఉపయోగపడుతున్నాయి.
మానుకోట జిల్లాలో కరోనా రహిత గ్రామాలు
మహబూబాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఒక్క కరోనా కేసు కూడా లేకపోవడం అక్కడి ప్రజల కట్టుబాటుకు నిదర్శనంగా మారింది. ప్రధానంగా కొత్తగూడ ఏజెన్సీ ఏరియాలో 15 గ్రామాల్లో కరోనా జాడ లేదు. ఎర్రవరం, కున్దాన్పల్లి, సరసనపల్లి, రౌత్తుగూడెం, హన్మాన్తండా, గుం డం, తిమ్మాపూర్, ఆదిలక్ష్మీపురం, మొండ్రాయిగూడెం, మొకలపల్లి, అంకన్నగూడెం, పోగుళ్లపల్లి తండా, బోరింగ్తండా, చక్రాలతండా, మొండ్రాయిగూడెం తండా, తొర్రూ రు మండలం కర్కాల, ఖానాపురం, గంగా రం మండలం బావురిగొండ, నెల్లికుదురు మండలం లక్ష్మిపురం, దంతాలపల్లి మండ లం దొనకొండ పంచాయతీల్లో ప్రస్తుతం ఒక్క కరోనా కేసు కూడా లేదు.
స్వచ్ఛంద సంస్థల సేవానిరతి
కరోనా వేళ బాధితులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. నిత్యావసర సరుకులు, మెడిసిన్ సైతం తెచ్చుకోలేని వారికి సేవలందిస్తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి సతీమణి ఉష నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా స్కులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. తొర్రూరులోని మదర్ వలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు సిరికొండ విక్రమ్ నేరుగా ఇంటికి వెళ్లి మందులు, సరుకులు ఇస్తున్నారు. మరిపెడ ప్రాంతంలో అన్నం ఫౌండేషన్ కొవిడ్తో చనిపోయిన వారి దహన సంస్కారాలు చేయడంతో పాటు నిరాదరణకు గురైన వారికి ఆశ్రయం కల్పిస్తోంది. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శ్రీ వాసవి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు గర్రెపల్లి వెంకటేశ్వర్లు కరోనా సోకిన వారికి ఉచితంగా భోజనం సరఫరా చేస్తున్నారు. కొత్తగూడ మండలంలో శ్రీ గంగా సరస్వతి చారిటబుల్ ట్రస్ట్, జేసీబీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు.
తగ్గుతున్న కేసులు..
లాక్డౌన్ అమలు నాటి నుంచి కరోనా నిబంధనల ఉల్లంఘన కేసుల సంఖ్య తగ్గింది. లాక్డౌన్కు ముందు జిల్లాలో రాత్రివేళ కర్యూ నిబంధనలను పాటించకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరాన్ని పాటించకపోవడం, పెద్ద ఎత్తున జనం పోగుకావడం, మద్యం, గుట్కా, గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 3,653 కేసులు నమోదయ్యాయి. లాక్డౌన్ విధించిన నాటి నుంచి ఇప్పటివరకు 224 కేసులు మాత్రం నమోదయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి 10గంటల వరకు అన్ని రకాల షాపులు తెరచి ఉంచడం అన్ని వర్గాల ప్రజలు ఊరట చెందుతున్నారు.