నర్సంపేట, మే 17 : అమెరికాలోని దాతల సహకారంతో నర్సంపేట ఏరియా హాస్పిటల్లో అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. సోమవారం నర్సంపేట ఏరియా దవాఖానను ఆయన సందర్శించి కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలోని మేడపెల్లికి చెందిన తన చిన్ననాటి మిత్రులు అమెరికాలో స్థిరపడ్డారని వివరించారు. వారితో నిర్వహించిన జూమ్ మీటింగ్లో దవాఖాన అభివృద్ధిపై చర్చించామన్నారు. అమెరికా ఇతర దేశాల్లో కరోనా నివారణకు వినియోగించే వైద్య పరికరాలు మన దేశంలో తక్కువ ఉన్నాయని పెద్ది సుదర్శన్రెడ్డి చెప్పారు. నర్సంపేట హాస్పిటల్కు రూ.30 లక్షల వ్యయంతో 10 ఐసీయూ పడకలు, రెండు వెంటిలేటర్లు, వాటికి సపోర్టుగా ఎనిమిది రకాల వైద్య పరికరాలను అందించేందుకు తన మిత్రులు అంగీకరించారని ఆయన వివరించారు. రూ.30 లక్షల వి లువైన పరికరాలను అందించి ఫార్మారంగంలో పేరు తీసుకొచ్చిన మిడియాల సుధాకర్, తూముల వెంకట్ నర్సంపేట దవాఖాన అభివృద్ధికి ముందుకు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కరోనా చికిత్సతో పా టు ఇతర జబ్బులకు వైద్య సేవలందించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ఏరియా హాస్పిటల్లో ప్రస్తుతమున్న 20 ఆక్సిజన్ పడకలతో పాటు అదనంగా మరో 20 పడకలను తీసుకరానున్నట్లు పెద్ది తెలిపారు. కరోనా బాధితులకు రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరో రెండు వారాల్లో అమెరికాలోని నిర్మాణ్ ఓఆర్జీ సంస్థ ద్వారా రూ.30 లక్షల విలువైన సామగ్రి నర్సంపేట దవాఖానకు వస్తుందన్నారు. దవాఖానలో పడకలు పెంచడంతోపాటు హాస్పిటల్ నిర్వహణ బడ్జెట్ను పెంచి అవసరమైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్లో భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని పెద్ది సుదర్శన్రెడ్డి వెల్లడించారు. కరోనా కష్టకాలంలో మానవత్వం తో స్పందించిన దాతలకు నియోజకవర్గ ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.