వరంగల్ చౌరస్తా, మే 17: వైద్యసేవల్లో సిబ్బంది నిర్లక్ష్యం, అలసత్వాన్ని సహించమని ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వీ చంద్రశేఖర్ అన్నారు. ఎంజీఎంలో కరోనా వైద్యసేవలు అందిస్తున్న ట్రయాజ్ వార్డు, కొవిడ్ వార్డులను సోమవారం ఆయన సందర్శించి, రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుని వారిలో మనోధైర్యాన్ని నింపారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. ఎప్పటికప్పుడు కేసుల వివరాలు నమోదు చేయాలని, వైద్యులు సూచించిన మందులు, ఇంజక్షన్లు బాధితులకు ఇవ్వాలని విధులు నిర్వర్తిస్తున్న నర్సులకు సూచించారు. ప్రతి రోజూ ఫార్మసీ స్టోర్స్ నుంచి తీసుకున్న మందుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని చంద్రశేఖర్ కోరారు. కొవిడ్ వార్డులో రోగులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అవసరానికి తగినన్ని ఔషదాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిబంధనలు పాటించకున్నా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పని ఆయన హెచ్చరించారు.
మృతురాలికి నివాళి
కొవిడ్ వార్డులో వైద్యసేవలందిస్తూ కరోనా బారినపడి మృతి చెందిన ఉద్యోగినికి ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్తో పాటు పలువురు ఉద్యోగులు నివాళులర్పించారు. కొద్ది రోజులుగా కొవిడ్ వార్డులో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందిన స్టెరిలైజేషన్ విభాగం ఉద్యోగిని ఎర్ర సుకుమాల మృతదేహాన్ని వారు సందర్శించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ కరో నా బారినపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.