కరోనా వైరస్పై అప్రమత్తంగా ఉండాలి
నిబంధనలు పక్కాగా పాటించాలి
హెచ్చరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు
వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపు
నర్సంపేట, ఏప్రిల్ 17: కరోనా వైరస్ సోకకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ అన్నారు. మున్సిపాలిటీలో శనివారం ఉద్యోగులు, కార్మికులకు వైద్య పరీక్షలు చేశారు. కార్మికులకు సబ్బులు, కొబ్బరి నూనెలు అందించారు. అనంతరం పట్టణంలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె అన్నారు. గాలి ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ భౌతికదూరం పాటించాలన్నారు. లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, కమిషనర్ విద్యాధర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కాగా, నర్సంపేట ఏరియా దవాఖానలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. టీకా తీసుకునేందుకు శనివారం ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో నర్సంపేట ఏరియా ఆస్పత్రిలో టీకాలు తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి
పర్వతగిరి: బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సర్పంచ్ గటిక సుష్మ కోరారు. చింతనెక్కొండలోని వీధుల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేసి కరోనాపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ గటిక మహేశ్, ఉపసర్పంచ్ దేవేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
117 మందికి కొవిడ్ టీకా..
చెన్నారావుపేట: మండలకేంద్రంలోని పీహెచ్సీలో శనివారం 117 మందికి కరోనా టీకాలు వేసినట్లు వైద్యాధికారి ఉషారాణి తెలిపారు. మండలంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున అందరూ మాస్కులు ధరించాలని కోరారు. సబ్సెంటర్లలో 139 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్వో వెంకటేశ్వరరావు, స్టాఫ్నర్సు స్వరూపారాణి, లలిత, హెల్త్అసిస్టెంట్ కుండె శివాజీ, సూపర్వైజర్ రామెల్ పాల్గొన్నారు.
ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్
దుగ్గొండి: మండలంలో వైద్య సిబ్బంది కరోనా టెస్ట్ల సంఖ్యను పెంచడంతోపాటు వ్యాక్సినేషన్ను ముమ్మరం చేశారు. వైద్య సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి పారిశుధ్య కార్మికులు, జీపీ సిబ్బంది, గ్రామస్తులకు కరోనా పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారి రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాలని కోరారు. మాస్క్లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లు వాడాలన్నారు.
వ్యాపిస్తున్న వైరస్..
నల్లబెల్లి: మండలంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి మహేందర్నాయక్ సూచించారు. మేడపల్లి, నల్లబెల్లి పీహెచ్సీల్లో వైద్యాధికారులు మహేందర్నాయక్, శశికుమార్ ఆధ్వర్యంలో కరోనా టెస్టులు చేస్తున్నారు. నల్లబెల్లి పీహెచ్సీలో శనివారం 123 మందికి టెస్టులు చేయగా, ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
సోడియం ద్రావణం పిచికారీ
నెక్కొండ: మండలంలోని రెడ్లవాడలో సర్పంచ్ రావుల శ్రీలత-ప్రసాద్, కస్నాతండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ రవి ఆధ్వర్యంలో వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టినట్లు సర్పంచ్లు తెలిపారు. కస్నాతండాలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
నడికూడలో నిర్ధారణ పరీక్షలు
నడికూడ: రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రదీప్కుమార్ ఆదేశాల మేరకు 104 ఆధ్వర్యంలో మండలకేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆరోగ్య ఉపకేంద్రంలో ఆర్టీపీసీఆర్ కిట్ల ద్వారా 20 మందికి టెస్టులు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఊర రవీందర్రావు, ఏఎన్ఎం విజయలక్ష్మి, ఎంఎల్హెచ్పీ శోభ, 104 సిబ్బంది ధర్మరాజు, కుమార్, ఎంఎం కవిత, ఆశ వర్కర్లు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దురిశెట్టి చందు, గొడిశాల రంజిత్, కామిద్రి చంద్రమౌళి పాల్గొన్నారు.
17 మందికి పాజిటివ్
ఆత్మకూరు: మండలంలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు పీహెచ్సీ వైద్యాధికారి రణధీర్ తెలిపారు. చౌళ్లపల్లిలో 5, ఆత్మకూరులో 4, పెద్దాపురంలో 3, అక్కంపేటలో 2, నాగయ్యపల్లిలో 1, కటాక్షపురంలో 1, పెంచికలపేటలో ఒక కేసు నమోదైనట్లు వైద్యాధికారి తెలిపారు. అత్యవసర సమయంలో మాత్రమే ప్రజలు బయటకు రావాలని కోరారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
నర్సంపేట రూరల్: మండలంలోని భాంజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి భూపేశ్ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా వైద్యాధికారి మా ట్లాడుతూ 45 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. టీకా వేసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కొవిడ్-19 నిబంధనలు పాటించాల న్నారు. లక్నేపల్లిలో సర్పంచ్ గొడిశాల రాంబాబు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని కోరారు. ఆయన వెంట కారోబార్ ఉల్లేరావు రాజయ్య, జీపీ సిబ్బంది ఉన్నారు.