బాధ్యతల స్వీకరణ
వరంగల్ చౌరస్తా, మే 16 : వరంగల్ ఎంజీఎం దవాఖాన ఇన్చార్జి సూపరింటెండెంట్గా డాక్టర్ వలపదాసు చంద్రశేఖర్ను నియమిస్తూ తెలంగాణ డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) డాక్టర్ రమేశ్రెడ్డి శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఆయన ఎంజీఎం సూపరింటెండెంట్గా డాక్టర్ నాగార్జునరెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. 1985 -91 విద్యా సంవత్సరంలో కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన, 1994-97లో కాకతీయ మెడికల్ కళాశాలతోపాటు ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి ఎండీ పట్టా పొందారు. 1998 నుంచి సుమారు ఎనిమిది సంవత్సరాలపాటు ఎంజీఎం డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, 2006 నుంచి సుమారు నాలుగున్నర సంవత్సరాలు అసోసియేట్ ప్రొఫెసర్గా, 2011 నుంచి ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ విషయంలో 2014 జులై నుంచి 2017 మార్చి వరకు కాకతీయ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించారు. 2017 ఏప్రిల్ నుంచి 2018 జూన్ వరకు సుమారు 15 నెలలు కేఎంసీ ప్రిన్సిపాల్గా పని చేశారు. కేఎంసీ పీజీ సీట్ల పెంపునకు చంద్రశేఖర్ విశేష కృషి చేశారు. ఎంజీఎంలో కరోనా విభాగం ఏర్పాటు చేసిన సమయంలో కొవిడ్ విభాగానికి నోడల్ ఆఫీసర్గా వ్యవహరించారు. కరోనా వ్యాప్తి, టెస్టింగ్, కట్టడి అంశాలపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉన్నందున సూపరింటెండెంట్గా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ సహకారంతో తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఇన్చార్జి సూపరింటెండెంట్గా భాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు వైద్యులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, నాయకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.