అంచనాలకు మించి ధాన్యం దిగుబడులు
కొనుగోలు కేంద్రాల వద్ద పోటెత్తుతున్న ధాన్యం
ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ల వద్ద లారీల కొరత
వరంగల్రూరల్, మే 15(నమస్తేతెలంగాణ) : ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నీటిని అందుబాటులోకి తేవడంతో ఈ ఏడాది యాసంగి వరి పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ధాన్యం దిగుబడులు కూడా ఇదే స్థాయిలో ఎగబాకాయి. అధికారుల అంచనాలకు మించి ధాన్యం దిగుబడులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. పెరిగిన ధాన్యం దిగుబడులకు అనుగుణంగా అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్మిల్లులకు ధాన్యం రవాణా కోసం అద్దె వాహనాలు సమకూర్చుతున్నది. తాజాగా ధాన్యం రవాణాకు కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామాల్లోని ట్రాక్టర్లను వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా రైస్మిల్లులకు తరలించిన రైతులకు అద్దె చెల్లిస్తామని శనివారం జిల్లా సహకార అధికారి(డీసీవో) సంజీవరెడ్డి ప్రకటించారు. ప్రస్తు తం గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్లు, సబ్సిడీపై ప్రభుత్వం రైతులకు అందజేసిన ట్రాక్టర్లను ధాన్యం రవాణాలో ఉపయోగించేందుకు అనుమతించాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల చైర్మన్లు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది యాసంగి లో రైతులు జిల్లా వ్యాప్తంగా 1,31,656 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారని, ఇందులో 3,24,322 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు ఇటీవల ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో తెలిపారు. ఈ దిగుబడుల్లో రైస్మిల్లర్లు 74,322 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేస్తారని, యాభై వేల మెట్రిక్ టన్నులు స్థానికంగా వినియోగమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక రూపొందించారు.