బాల్య వివాహాలు లేని తెలంగాణే లక్ష్యం
పిల్లలకు పెండ్లిళ్లు చేయడం సాంఘిక దురాచారం
పైలట్ ప్రాజెక్టుగా మహబూబాబాద్ జిల్లా
రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, జూన్ 12: రాష్ట్రంలో మహిళల సంరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేశం విద్య, సాంకేతికపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా సమాజంలో బాల్య వివాహాలు చేస్తుండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. శనివారం ఆమె హైదరాబాద్లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యతో కలిసి మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, చైల్డ్వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ సుంకరనేని నాగవాణితో వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణను బాల్య వివాహాలు లేకుండా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. బాల్యవివాహాలు సాంఘిక దురాచారమే కాకుండా నేరమన్నారు. పెళ్లిపీటల వరకు వెళ్లిన వివాహాన్ని అడ్డుకునే కంటే.. అలాంటి పరిస్థితులు రాకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని అధికారులు, ఎన్జీవోలు బాల్య వివాహాలపై కుల, మత పెద్దలకు అవగాహన కల్పించాలన్నారు. వెబినార్లో మహిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సుదర్శన్ పాల్గొన్నారు.