కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. ఈ మాయదారి వైరస్ పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. అనేక మంది ప్రాణాలను బలిగొంటున్నది. ఒకరి తర్వాత మరొకరు కరోనా సోకి దవాఖానల పాలవుతున్నారు. చివరకు లక్షల రూపాయలు ఖర్చు చేసి చికిత్స పొందుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. ఒక చోట తల్లి, మరో చోట తండ్రి, ఇంకో చోట కొడుకు ఇలా ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు తనువు చాలిస్తున్నారు. దీంతో ఆ కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోతున్నాయి.
నెల్లికుదురు, మే 11: కరోనా వైరస్ ఒకే కుటుంబంలో తొమ్మిది రోజుల వ్యవధిలో ముగ్గురుని బలిగొన్నది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది. మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉద్యోగి (ఆఫీస్ సబార్డినేట్) మద్ది భిక్షం(65) కరోనా బారినపడి ఈ నెల 2న చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇతని పెద్ద కుమారుడు మద్ది వీరన్న (45) నెల్లికుదురు ప్రభుత్వ కళాశాలలో సెరీకల్చర్ ల్యాబ్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తండ్రి చనిపోయిన రెండు రోజులకే కరోనాతో మృతి చెందా డు. అదేవిధంగా మద్ది భిక్షం చిన్న కుమారుడు ఉపేందర్(35) మంగళవారం కరోనాతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇతడు వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఐదు రోజుల వ్యవధిలో తండ్రీకొడుకు..
నర్సంపేట: నర్సంపేట జిల్లా కేంద్రంలో కరోనా మహమ్మారి ఐదు రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరిని బలిగొన్నది. నర్సంపేటకు చెందిన గొడిశాల చేరాలు, విజయ్ తండ్రీకొడుకులు. తండ్రి ఇంట్లోనే ఉంటుండగా, కుమారుడు గూడూరు ఎంపీడీవో కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. చేరాలుకు పదిరోజుల కిందట కరోనా పాజిటివ్ రాగా ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం కుమారుడికి వైరస్ సోకడంతో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఈ నెల 5న మృతిచెందాడు. ఐదు రోజుల తర్వాత సోమవారం రాత్రి తండి గొడిశాల చేరాలు మృతి చెందారు. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
తల్లి మృతి.. చావుబతుకుల మధ్య తండ్రి
పోచమ్మమైదాన్: వరంగల్ చార్బౌళి ప్రాంతానికి చెందిన ఓ మిల్క్ సెంటర్ వ్యాపారి తల్లిదండ్రులకు ఒకేసారి కరోనా సోకింది. ఆందోళనకు గురైన కుమారుడు తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితులను బట్టి తండ్రిని ములుగు రోడ్డులోని ఒక ప్రైవేట్ దవాఖానలో, తల్లిని హన్మకొండలోని మరో ప్రైవేట్ దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కుమారుడు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో అతడి తల్లిదండ్రులు ఉన్నచోట చికిత్స చేయించుకుంటే వాళ్లకు తెలుస్తుందని భావించి హైదరాబాద్లో అడ్మిట్ అయ్యాడు. ఇక్కడి దవాఖానలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న సమయంలోనే మంగళవారం ఉదయం తల్లి మృతిచెందింది. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితికి చేరుకున్నారు. తల్లి కడచూపు చూడటానికి కూడా అవకాశం లేకపోయింది. చివరకు కుటుంబ సభ్యులే దహన సంస్కారాలు నిర్వహించారు. అలాగే చావుబతుకుల మధ్య ఉన్న తండ్రికి ఆమె చనిపోయిన విషయాన్ని చేరనీయలేదు. తల్లిని కోల్పోయి, తండ్రిని చూడలేక కొడుకు తల్లడిల్లిపోతున్నాడు.