తొర్రూరు/ నర్సింహులపేట/ దంతాలపల్లి/ నెల్లికుదు రు/ కురవి/ కేసముద్రం/ చిన్నగూడూరు(మరిపెడ), మే 11: మరోసారి ప్రకృతి కన్నెర్ర చేసింది. అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. మంగళవారం సాయంత్రం ఈదురు గాలుల బీభత్సంతోపాటు కుండపోతగా కురిసిన వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. కొనుగోలు కేంద్రాలకు అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం తడిసిముద్దయింది. వడ్లగింజలు వరదనీటి కొట్టుకుపోయాయి. ధాన్యపు రాశులను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడి పలు గ్రామాల్లో కరంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇండ్ల పై కప్పులు లేచిపోయాయి. తొర్రూరు, గుర్తూరు, అమ్మాపురం, నాంచారిమడురు. వెల్లికట్టె, కంఠాయపాలెం, మడిపల్లి, హరిపిరాల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. నర్సింహులపేట మండలంలో ఇండ్ల పై కప్పులు లేచిపోయాయి.
కొమ్ములవంచలో పార్నంది వెంకన్న ఇంటి ఆవరణలో చెట్టు కూలి పాడిగేదె మృతిచెందింది. బీల్యాతండాలో లాకవత్ పక్కు చెందిన దుక్కిటెద్దుపై చెట్టుపడి మెడలు విరిగాయి. జగ్గుతండా పరిధి కొత్తతండాలో చెట్టు పడి భూక్యా శ్రీనుకు చెందిన ఆవు మృతి చెందింది. మండలంలో 50కి పైగా ఇండ్ల పై కప్పులు లేచిపోయినట్లు అధికారులు అంచనా వేశారు. 150కి పైగా విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్లు విద్యుత్ ఏఈ పాండు తెలిపారు. కొనుగోలు కేంద్రాలు, వరి కల్లాలో ధాన్యం తడిసిపోయాయి. దంతాలపల్లి మండలంలోని కుమ్మరికుంట్ల, పెద్దముప్పారం, బొడ్లాడ, వేములపల్లి, దాట్ల, దంతాలపల్లి, రేపోణి, గున్నెపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు, బస్తాలు తడిసిముద్దయ్యాయి.
కురవి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటి పాలైంది. కల్లాలో ఆరబోసిన మిర్చి తడువడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల్లికుదురు మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో వాన నీళ్లు నిలిచి ధాన్యం తడిసిముద్దయింది. వరద నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. కేసముద్రం మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, కల్లాల్లో మొక్కజొన్న, పసుపు తడిసిం ది. గాలికి చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మరిపెడ మండలంలోని వరితోపాటు మిర్చి పంట కల్లాల్లో తడిసిపోయింది. తానంచెర్లలో పాదూరి శ్రావణ్రెడ్డి కోళ్లఫాం కొట్టుకుపోయింది. చిన్నగూడూరు మండలంలో గాలివానకు చెట్లు నేలకూలాయి. మామిడికాయలు రాలిపోయా యి. విస్సంపల్లిలో ఆటోపై చెట్టు విరిగిపడింది. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి, రెడ్యాల, జంగిలికొండలో ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఇస్లావత్ తండా (ఎస్) విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ విరిగి కిందపడింది.
తడిసిన ధాన్యం కొంటాం : కలెక్టర్
జిల్లాలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ వీపీ గౌత మ్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు అధైర్య పడొద్దని భరోసానిచ్చారు.