2019-20 సంవత్సరంలో రూ.1.33కోట్లు పంపిణీ
జిల్లాలో 2,375 మంది ఎస్సీ విద్యార్థులకు లబ్ధి
31వ తేదీ వరకు స్కాలర్షిప్ గడువు పొడిగింపు
భూపాలపల్లి రూరల్, మే 9: కరోనా సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నది. ఎస్సీ విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న వారికి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నది. ఇందులో భాగంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు రూ. 1.33 కోట్లు మంజూరు చేసి అందించింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు వెయ్యి మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 28 వరకే దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ కరోనా వైరస్ విజృంభిస్తున్నందున చాలామంది విద్యార్థులు స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ విషయాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం మే 31వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించింది. ఇంటర్ నుంచి పీజీ వరకు ఉచిత విద్యతో పాటు నెలనెలా ఉపకార వేతనాలు అందిస్తున్నది.
2,375 మంది విద్యార్థులకు లబ్ధి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో గతేడాది చదువుకున్న మొత్తం ఎస్సీ విద్యార్థులు 2,375 మంది ఉన్నారు. వీరికి స్కాలర్షిప్, ఫీజ్ రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం రూ.1.33కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఇంటర్, పీజీ విద్యార్థులకు ఒక్కొక్కరికి స్కాలర్షిప్ కింద ప్రతి ఏడాది రూ.5వేల చొప్పున చెల్లిస్తున్నది. ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు దాదాపు రూ.13,500లను నేరుగా కళాశాల యాజమాన్యాల ఖాతాల్లో జమచేస్తున్నది. అంతే కాకుండా ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల పేరుతో పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న ఎస్సీ బాలురకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి, బాలికలకు రూ.1500 అందజేస్తున్నది.
ఓవర్సీస్ పథకం..
విదేశాల్లో చదువుకోవాలనుకునే పేదింటి దళిత విద్యార్థుల కలలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల మేర సాయం అందజేస్తున్నది. ఇప్పటి వరకు జిల్లాకు చెందిన ఇద్దరు లబ్ధి పొందారు. వీరిద్దరూ అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. జీఆర్ఈ 260 పైన, ఐఈఎల్టీ 6 పైన స్కోరింగ్, బీటెక్లో 60శాతం మార్కులు ఉండాలి. వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయ పరిమితి రూ.5లక్షలు మించకుండా ఉన్న విద్యార్థులు అర్హులు. ఈ పథకంపై జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు అధికారులు ప్రతిఏడాది అవగాహన కల్పిస్తున్నారు.