రూ.13 లక్షల విలువైన మిరుప విత్తన ప్యాకెట్లు స్వాధీనం, కారు సీజ్
వివరాలు వెల్లడించిన మానుకోట ఎస్పీ కోటిరెడ్డి
మహబూబాబాద్, జూన్ 7 : ఏపీలోని గుంటూరు జిల్లా నుంచి మహబూబాబాద్ మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి అక్రమం గా తరలిస్తున్న రూ.13 లక్షల విలువైన నకిలీ మిరుప విత్తనాలు, కారును స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. సోమవారం మహబూబాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూ రు జిల్లా నుంచి మహబూబాబాద్ మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి అక్రమంగా నకిలీ మిరుపవిత్తనాలు తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
ఈ మేరకు ఈదులపూసల్లి వద్ద వాహన తనిఖీలు చేస్తున్న రూరల్ సీఐ రవికుమార్, జిల్లా టాస్క్ఫోర్స్ బృందానికి కారు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి పరిశీలించారు. మిరుపవిత్తన ప్యాకెట్లు అధికంగా కనిపించడంతో కారులో ఉన్న వ్యక్తులను విచారించగా అవి నకిలీ విత్తనాలని బయటపడింది. దీప్తి, భూమిక, పలనాడు, సిరి, రాజేశ్వరి, పద్మావతి, అల్ట్రా కంపెనీలకు చెందిన రూ.13 లక్షల విలువైన విత్తన రకాలను స్వాధీనం చేసుకుని, గుంటూరు జిల్లా కోసూ రు మండలం ఆవులవారిపాలానికి చెందిన ఈపురి వెంకటప్రసాద్, పిడుగరాళ్లకు చెందిన తిప్పిరెడ్డి శ్రీరామ్రెడ్డి, నుగుల నాగరాజు అనే ముగ్గురిని అరెస్టు చేసి, కారును సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి ఛత్రునాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నకిలీ విత్తనాలు తరలిస్తున్న వ్యాపారులను అరెస్ట్ చేసిన రూరల్ సీఐ రవికుమార్, టాస్క్ఫోర్స్ అధికారులను అభినందించారు. ఇతర రాష్ర్టాల నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి విక్రయిస్తున్న వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ యోగేశ్గౌతమ్, ఏవో తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
విత్తన విక్రయదారులకు డీఎస్పీ వెంకటరమణ హెచ్చరిక
మరిపెడ, జూన్ 7 : విత్తన విక్రయదారులు రైతులను మోసం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ హెచ్చరించారు. సోమవారం మరిపెడ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న భూక్యా రవికుమార్, భూక్యా శంకర్ను అదుపులోకి తీసుకొని, రెండు ద్విచక్రవాహనాలు, రూ.4లక్షల విలువైన 794 ప్యాకెట్ల మిరుప విత్తనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. విత్తన వ్యాపారులు రైతులను వంచనకు గురిచేస్తే సహించేది లేదన్నారు. రైతులు సైతం విత్తన విక్రయదారులను నమ్మి మోసపోవద్దని, తప్పకుండా రసీదులు పొందాలని సూచించారు. ఈ మరిపెడ సీఐ సాగర్, ఎస్సై శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.