‘పల్లె ప్రగతి’కి తోడ్పాటు
పుట్టిన ఊరికి రూ.20.50కోట్లు
మరో రూ.10 కోట్ల ఖర్చుకు ప్రణాళిక
యువకులు, కార్మికులకు తన కంపెనీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
బీటీరోడ్లు, బ్రిడ్జి నిర్మాణంతో తీరిన ప్రజల కష్టాలు
ఆదర్శంగా నిలిచిన గ్రామం
వర్ధన్నపేట, మే 4: ఎంత ఆర్జించినా.. ఎన్ని పేరుప్రఖ్యాతులు పొందినా.. ఎక్కడ ఉన్నా.. సొంతూరికి సేవ చేస్తే కలిగే సంతృప్తే వేరు. సంపాదించినదాంట్లో కొంత మొత్తాన్ని పుట్టిన గడ్డకోసం వెచ్చిస్తే ఊరి అభివృద్ధికి మనవంతు తోడ్పాటునందించినట్లవుతుంది. ఈ దిశగానే ఆలోచించిన కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కామిడి నర్సింహారెడ్డి తన స్వగ్రామం దమన్నపేట ప్రగతికి దన్నుగా నిలిచాడు. గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులను సొంత ఖర్చుతో చేస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన కే నర్సింహారెడ్డి, కేఎన్ఆర్ పేరిట నిర్మాణ కంపెనీని స్థాపించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడు. కుటుంబంతో హైదరాబాద్లో స్థిరపడ్డ ఆయన, తాను పుట్టిన వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేట అభివృద్ధికి కంకణం కట్టుకున్నాడు. ఇప్పటికే రూ.22కోట్ల మేర ఖర్చు చేసి పాఠశాల భవనం, సీసీరోడ్లు, బ్రిడ్జి, బీటీ రోడ్లు నిర్మించి ప్రజల ఇబ్బందులను తీర్చుతున్నాడు. గ్రామ చెరువులోకి నీటిని తరలించేందుకు కాలువ నిర్మాణం కోసం మరో రూ.10 కోట్లు కేటాయించేందుకు కంపెనీ ద్వారా ప్రణాళికను కూడా సిద్ధం చేయించాడు. పల్లెప్రగతిలో భాగంగా పుట్టిన గ్రామాలకు ప్రముఖులు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో దమ్మన్నపేటలో అభివృద్ధి పనులు చేపడుతున్నాడు. గ్రామానికి చెందిన యువకులు, కార్మికులకు తన కంపెనీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు.
పల్లె ప్రగతికి రూ.22కోట్ల విరాళం
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు స్పందించిన నర్సింహారెడ్డి, ఆయన కొడుకు జలేందర్రెడ్డి 2020 జనవరిలో పల్లెప్రగతి కోసం రూ.22 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఇందులో వర్ధన్నపేట-జఫరగఢ్ ప్రధాన రహదారి నుంచి ఊరిలోని ప్రభుత్వ పాఠశాల వరకు రూ.1.42 కోట్లతో 24 ఫీట్ల వెడల్పుతో డబుల్ సీసీరోడ్డు వేశారు. ప్రభుత్వ పాఠశాలలో రెండు అదనపు గదులు, మోడ్రన్ టాయిలెట్లను రూ.46.71 లక్షలతో పూర్తి చేశారు. పురాతన ఆంజనేయస్వామి ఆలయానికి రూ.5 లక్షలు విరాళం ఇవ్వడంతో పాటు అర్చకుడికి రూ.8లక్షలతో ఆలయ ఆవరణలోనే ఇంటిని నిర్మించారు. అన్ని కాలనీల్లో సీసీరోడ్ల కోసం రూ.1.57 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయిస్తున్నట్లు సర్పంచ్ అర్జుల మంగ, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి తెలిపారు.
రూ.11.50లక్షలతో మంచినీటి బావి
గ్రామస్తుల కోరిక మేరకు ఊరి సమీపంలోని వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు వద్ద రూ.11.50 లక్షలతో మంచినీటి బావి తవ్వించాడు. బావి నుంచి ఊరిలోని వాటర్ ట్యాంకులకు నీటిని సరఫరా చేసేందుకు మోటర్లు, పైపులైన్లు కూడా వేయించి గ్రామస్తుల దాహం తీరుస్తున్నాడు. ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా బావి నీటిని కూడా ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు.