మహబూబాబాద్ : బాలికలు అన్ని రంగాల్లో రాణించి అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ కే.శశాంక సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణించిన బాలికలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బేటీ బచావో.. బేటీ పఢావో కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. బాలికల పరిరక్షణకు కృషి చేస్తున్న సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణిని అభినందించారు. అనంతరం నాగవాణి మాట్లాడుతూ… జిల్లాలో బాలికల అక్షరాస్యత 88 శాతమే ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సెకండరీ విద్యలో 52, ఉన్నత విద్యలో 33 శాతం మాత్రమే అక్షరాస్యత బాలికల్లో ఉంటుందని నివేదించారు.
మహబూబాబాద్ గిరిజనుల ప్రాంతమని ఇక్కడ అక్షరాస్యత శాతం పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బాలికల పట్ల వివక్ష మరింత ఎక్కువ కాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి అవసరమన్నారు. అనంతరం బాలికల విద్యాభివృద్ధి కోసం రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాషా అభినవ్, కొమురయ్య, మహిళా శిశు సంక్షేమాధికారిణి స్వర్ణలతాలెనినా, సీడీపీవో డెబోరా, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.