మహబూబాబాద్ : కీట్స్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు డిజిటల్ సర్వేపై శిక్షణ ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వందేమాతరం ఫౌండేషన్ సౌజన్యంతో కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుని, ఉద్యోగాలు చేసి, 2014లో పదవీ విరమణ చేసిన ఇంజనీర్లు అంతా కలిసి, ఇంజనీర్స్ అల్యూమినీ ట్రస్ట్ ఫర్ సర్వీస్ (కీట్స్) ను ఏర్పాటు చేశారు. కీట్స్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు మంత్రి ఎర్రబెల్లి ఆదివారం సర్టిఫికేట్లు అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ కీట్స్ ట్రస్టు ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా డిజిటల్ సర్వేపై శిక్షణ ఇస్తున్నారు. రూ. 40 లక్షల విలువ చేసే టేపు, కాంపాస్, డిజిటల్ థియేడలైట్ వంటి పరికరాలు సమకూర్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎంపిక చేసిన 25 మంది విద్యార్థులకు ఆటో క్యాడ్ లో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నారు.
భూమిని సర్వే చేయడం ఒకప్పుడే కాదు… ఇప్పటికీ కొంత సమస్యే. గొలుసులు పెట్టి ఏండ్ల తరబడి సర్వే చేసేవారు. చెలకలు, పొలాలు కొలవాలంటే దానికి ప్రత్యేక వ్యవస్థ ఉండేది. మన రాష్ట్రానికి సంబంధించి నిజాం కాలంలో భూ సర్వే జరిగింది. దేశంలో బ్రిటీష్ కాలంలో జరిగింది. మళ్ళీ భూ సర్వే చేయడానికి ఏ ప్రభుత్వాలు సాహసంచలేదు. కానీ, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ సాహసించారు. ధరణితో రెవిన్యూలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన సీఎం తాజాగా డిజిటల్ సర్వేకు పూనుకున్నారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా భూముల కొలతలు పూర్తి చేయనున్నారు.
ఎలాంటి ట్యాంపరింగ్కి, తప్పుడు కొలతలు, రాతలకు, ఒకరి సర్వే నెంబర్ ఒకరికి పడటం ఇక ఉండదు. ఇదే సమయంలో వందేమాతరం ఫౌండేషన్ చొరవతో కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుని, ఉద్యోగాలు చేసి, 2014లో పదవీ విరమణ చేసిన ఇంజనీర్లు అంతా కలిసి, ఇంజనీర్స్ అల్యూమినీ ట్రస్ట్ ఫర్ సర్వీస్ ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు ద్వారా మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించడం, విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వడం వంటివి చేస్తున్నారు.
తొర్రూరులోని నితిన్ భవనంలో 26 ఉచిత కంప్యూటర్లను కూడా అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కిట్స్ అందచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ నిర్ణయించిన డిజిటల్ సర్వేలో కూడా వీరికి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తాం. బడ్జెట్లో డిజిటల్ సర్వే కోసం రూ. 400 కోట్లు కేటాయించారు. ధరణి నిర్వహణ కోసం రూ. 47.68 కోట్లు కేటాయించారు. సర్వే పూర్తి చేసి భూ సమస్యలు తొలగించడమే సీఎం లక్ష్యం. ఈ శిక్షణను మరింత విస్తరించాలని భావిస్తున్న కీట్స్ ప్రతినిధులను సీఎంతో సమావేశం అయ్యేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీందర్ రావు, కీట్స్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.