వనపర్తి : చేతికొచ్చిన పిల్లలు ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు కడుపుశోకం పెట్టొద్దు అని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. గోపాల్ పేట మండలం తాడిపర్తిలో నిరుద్యోగి కొండల్ తల్లిదండ్రులు వెంకటమ్మ, రాములును మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. వారికి స్వయంగా రూ.లక్ష సాయం అందజేసి, డబల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు.. పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో జీవించాలని సూచించారు. నిరుద్యోగి కొండల్ ఆత్మహత్య బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదన్నారు. ఏడేళ్లలో లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుంది. 50 వేల ఉద్యోగాలకు 5 లక్షల మంది పోటీ పడొచ్చు.. మరి మిగిలిన 4.5 లక్షల మందికి ఆత్మహత్యలు చేసుకోవాలని ఆలోచిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అని ప్రశ్నించారు. ఆత్మహత్యలకు రాజకీయం చేయొద్దు అని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
నిరుద్యోగులను వారి స్నేహితులు హేళన చేసే విధంగా మాట్లాడొద్దు.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లినప్పుడే విజయం సాధ్యమవుతుందన్నారు. ఇతరులెవరూ తమ అన్నలాగా చనిపోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.