లండన్: 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియన్ ప్లేయర్గా ఆష్లీ బార్టీ నిలిచింది. అయితే ఈ వరల్డ్ నంబర్ టెన్నిస్ ప్లేయర్.. ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న విషయం చాలా మందికి తెలియదు. గతంలో ఆస్ట్రేలియా వుమెన్స్ బిగ్బాష్ లీగ్లోనూ బార్టీ ఆడటం విశేషం. శనివారం జరిగిన ఫైనల్లో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ప్లిస్కోవాపై 6-3, 6-7, 6-3తో గెలిచి కెరీర్లో రెండో గ్రాండ్స్లామ్ టైటిల్ ఎగరేసుకుపోయింది బార్టీ. 2019లో ఆమె ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది.
మల్టీ స్పోర్ట్స్ స్టార్
టెన్నిస్లో ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్గా ఎదిగినా.. 2014లో ఆమె కాసేపు ఈ ఆటకు బ్రేక్ ఇచ్చి క్రికెట్ వైపు వెళ్లింది. వుమెన్స్ బిగ్బాష్ లీగ్లో బ్రిస్బేన్ హీట్ టీమ్ తరఫున కూడా కొన్ని మ్యాచ్లు ఆడింది. తన జీవితంలో ఆ కాస్త క్రికెట్ కెరీర్ మరుపురానిదని బార్టీ చెబుతోంది. క్రికెట్ టీమ్లో తనకు చాలా మంచి సహచరులు దొరికారని, వాళ్లందరితో ఇప్పటికీ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె చెప్పింది.
వింబుల్డన్ గెలిచిన తర్వాత వాళ్ల నుంచి తనకు ఎన్నో సందేశాలు వచ్చినట్లు తెలిపింది. 2012 తర్వాత తొలిసారి మూడు సెట్ల పాటు జరిగిన వింబుల్డన్ ఫైనల్లో బార్టీ విజయం సాధించింది. తొలి సెట్లోనే 4-0 ఆధిక్యంలో దూసుకెళ్లిన బార్టీ.. చాలా సులువుగా ఫైనల్ గెలుస్తుందని అందరూ భావించారు. అయితే ప్లిస్కోవా నుంచి సెకండ్ సెట్లో అనూహ్యంగా తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆ సెట్ బార్టీ కోల్పోవడంతో మూడో సెట్ తప్పలేదు. ఆ సెట్లో మొదటి నుంచీ ఆధిపత్యం ప్రదర్శించిన బార్టీ.. మొత్తానికి టైటిల్ గెలిచింది.