న్యూఢిల్లీ : కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తే ఆ ముప్పును ఎదుర్కొనేందుకు దేశం సన్నద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా 1500 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. థర్డ్ వేవ్ ముంచుకొస్తుందనే వార్తల నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యత, సరఫరాలపై శనివారం ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్షా సమావేశం నిర్వహించారు.
దవాఖానల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని చెప్పారు. పీఎం కేర్స్ ఫండ్స్ ద్వారా ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేయడం ప్రారంభిస్తే నాలుగు లక్షల ఆక్సిజన్ పడకలకు ఆక్సిజన్ లభ్యమవుతుందని తెలిపారు.
ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై దవాఖానల సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ ప్లాంట్లు సత్వరమే పనిచేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ల పనితీరును స్ధానికంగా, జాతీయ స్ధాయిలో పర్యవేక్షించేందుకు అవసరమైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.