న్యూఢిల్లీ, జూలై 8: కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా మౌలిక వైద్య సదుపాయాల పెంపు కోసం కేంద్ర క్యాబినెట్ రూ.23,123 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ గురువారం భేటీ అయింది. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన తొలి సమావేశం ఇదే. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. కరోనా థర్డ్ వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం చూపిస్తుందన్న అంచనాల దృష్ట్యా కరోనా ప్యాకేజీని ప్రకటించారు. ప్యాకేజీలో భాగంగా 736 జిల్లాల్లో 2.4 లక్షల బెడ్లు, 20వేల ఐసీయూలు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో పిల్లల కోసం 20% కేటాయిస్తారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్యాకేజీని ఖర్చు చేస్తాయని ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. కేంద్రం రూ.15 వేల కోట్లు ఖర్చు పెడుతుందని, రాష్ర్టాలకు రూ.8,123 కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ డబ్బును 9 నెలల్లో ఖర్చు చేస్తామన్నారు. మరోవైపు, కొబ్బరి ఉత్పత్తిని పెంచేందుకు ‘కొబ్బరి అభివృద్ధి బోర్డు చట్టాని’కి సవరణలు చేయాలని, చైర్మన్ పదవిలో కొబ్బరి సాగులో అనుభవం ఉన్న వ్యక్తినే నియమించాలని క్యాబినెట్ నిర్ణయించింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జపాన్ ఫెయిర్ ట్రేడ్ కమిషన్ మధ్య సహకార ఒప్పందానికి మంత్రివర్గం అమోదం తెలిపింది.
మండీలు బలోపేతం
ఆత్మనిర్భర్ భారత్ కింద లక్ష కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఖర్చు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ డబ్బును వ్యవసాయ మార్కెట్లు వినియోగించుకోవచ్చని వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. మార్కెట్లను విస్తరించేందుకు, మండీల్లో రైతులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈ ఫండ్ నుంచి సాయం పొందవచ్చన్నారు. తాజా నిర్ణయం వ్యవసాయ మార్కెట్లను మరింత బలపరుస్తుందని చెప్పారు. కొత్త సాగు చట్టాల అమలుతో వ్యవసాయ మార్కెట్లు మూతపడతాయని రైతులు ఆందోళన చేస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.