-పుకార్లలో వాస్తవం లేదు: కేంద్రం
న్యూఢిల్లీ, జూన్ 21: కరోనా టీకా వేసుకుంటే మహిళల్లోగానీ, పురుషుల్లోగానీ వంధ్యత్వం సమస్య రాదని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం స్పష్టంచేసింది. వ్యాక్సిన్ల ద్వారా వంధ్యత్వం వస్తుందంటూ ప్రజల్లో అపోహలున్నాయని, మీడియాలో కూడా ఈ మేరకు వార్తలు వస్తున్నాయని.. కానీ, టీకాలతో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందనటానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపింది. పోలియో, మీజెల్స్-రూబెల్లా వంటి ఇతర వ్యాధులకు టీకాలు వచ్చిన సమయంలో కూడా అనేక పుకార్లు, అసత్యాలు ప్రచారంలోకి వచ్చాయని పేర్కొంది. కరోనా వ్యాక్సిన్లను అన్నిరకాల పరీక్షల తర్వాతే వినియోగంలోకి తీసుకొచ్చారని, అవి పూర్తిగా సురక్షితమైనవని.. అర్హులందరూ వేయించుకోవాలని సూచించింది.