పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పరితపించని తల్లిదండ్రులుండరు. అయితే వారికోసం పొదుపు, మదుపు మార్గాలను ఎంచుకోవడంలో మాత్రం చాలామంది తల్లిదండ్రులకు సందేహాలనేకం. అయితే ఏ ఒక్క సాధనంలోనో కాకుండా వివిధ దీర్ఘకాలిక సాధనాల్లో మదుపు చేయడం వల్ల ప్రయోజనాలను పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్ ఈటీఎఫ్లలో కూడా వారి భవిత కోసం మదుపు చేయవచ్చు. ప్రతి స్కీమ్కూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో సాధనం ఒక్కో విధంగా రాబడులను ఇస్తుంది. పిల్లల భవిష్యత్తు అనే దీర్ఘకాల లక్ష్యానికి తగ్గట్టుగా వాటిని ఎంచుకోవడం కూడా ముఖ్యమే. అలాంటి దీర్ఘకాల ప్రయోజనాలను అందించే మదుపు పథకాలేమిటో తెలుసుకుందాం.
మీకు పదేండ్లలోపు అమ్మాయి ఉంటే ఆమె పేరు మీద సుకన్య సమృద్ధి యోజన పథకంలో మదుపు చేయవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఈ పథకంలో గరిష్ఠంగా ఇద్దరు అమ్మాయిల పేరు మీద మదుపు చేయవచ్చు. పోస్టాఫీసులో లేదా బ్యాంకులో ఈ పథకాన్ని తీసుకోవచ్చు. వీటిలో ఈ-ట్రాన్స్ఫర్ ద్వారా కూడా మదుపు చేయవచ్చు. ఇందులో కనీస డిపాజిట్ రూ.250. ఆ తర్వాత గరిష్ఠంగా సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు ఏటా మదుపు చేయవచ్చు. 15 సంవత్సరాలపాటు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం కాలపరిమితి 21 ఏండ్ల కోసమే అయినప్పటికీ, అమ్మాయి ఆరేండ్ల వయసులో మదుపు చేయడం ప్రారంభిస్తే ఈ పథకం కాలపరిమితి 27 ఏండ్ల వరకు ఉంటుంది. అమ్మాయికి 18 ఏండ్ల వయసులో విద్య, వివాహం కోసం గరిష్ఠంగా 50 శాతం విత్ డ్రా చేసుకునే వీలుంది. అలాగే 21 ఏండ్లలోపు ఎప్పుడైనా పథకం నుంచి విరమించుకోవచ్చు. ఒకవేళ వివాహం కోసమే అయితే అమ్మాయికి కచ్చితంగా 18 ఏండ్ల వయసుకు సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకంపై 7.6 శాతం వడ్డీ రాబడి ఉంటుంది. ఏటా రూ.10,000 చొప్పున 15 ఏండ్లు మదుపు చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.4,24,000 వస్తుంది.
మీ పేరు మీద ఇప్పటికే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో మదుపు చేస్తున్నట్టయితే, మీ పిల్లల పేరుతో మరో అకౌంట్ను ఓపెన్ చేయవచ్చు. ఏటా గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు మదుపు చేయవచ్చు. పీపీఎఫ్లో మదుపు చేసే ప్రిన్సిపల్ మొత్తంపై పన్ను మినహాయింపులు ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద లభిస్తాయి. దీని మీద ఏటా 7.1 శాతం వడ్డీ రాబడి వస్తుంది. ఏటా రూ. 10 వేల చొప్పున 15 ఏండ్లపాటు మదుపు చేస్తే రూ.2,71,215 తిరిగి వస్తుంది.
కొన్ని బీమా పథకాలు ప్రీమియం రద్దు (డబ్ల్యూఓపీ) రైడర్తో పథకాలను అందిస్తున్నాయి. ఈ పథకంలో పాలసీ హోల్డర్ చనిపోయిన తర్వాత లేదా ప్రీమియం చెల్లించలేని పరిస్థితిలో కూడా బీమా అమలులో ఉంటుంది. బీమా సంస్థ బీమా మొత్తాన్ని చెల్లించి పాలసీ కాలపరిమితి వరకు ప్రీమియంను చెల్లిస్తూ ఉంటుంది.
పిల్లల భవిత కోసం మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం కూడా ప్రారంభించవచ్చు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లలో డైవర్సిఫైడ్ ఫోర్టుఫోలియోను రూపొందించుకోవచ్చు. ఫండ్లలో కనీసం పదేండ్లపాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో మదుపు చేస్తే పది శాతం ఎక్కువ రాబడి వచ్చే అవకాశాలు 74 శాతానికిపైగా ఉన్నాయి.
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్)లో కూడా మదుపు చేయవచ్చు. వీటిని ఫిజికల్ గోల్డ్కు ప్రత్యామ్నయంగా చూడవచ్చు. సెక్యూరిటీ, నాణ్యత వంటి రిస్క్లు ఇందులో ఉండవు. వీటిని ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కొనుగోలు చేయవచ్చు. బంగారం ధరలకు అనుగుణంగా వీటి ధరలు కూడా ఉంటాయి. మరో విధంగా చెప్పాలంటే బంగారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు చేయడమే. వివాహం సమయానికి ఈటీఎఫ్లను అమ్మేసి ఫిజికల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అలాగే గోల్డ్ సావరిన్ బాండ్లలో కూడా మదుపు చేయవచ్చు. వీటిని కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. వీటి కాలపరిమితి ఎనిమిదేండ్లు. వీటి లాకిన్ పీరియడ్ ఐదేండ్ల తర్వాత ముగుస్తుంది.