బ్రిటన్ పరిశోధకుల వెల్లడి
న్యూఢిల్లీ : ‘కరోనా ఆపత్కాలంలో మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం మనకి రక్షణ కల్పించాయి.. కానీ అవి పిల్లల్లో మాత్రం రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచాయి’ అని అంటున్నారు బ్రిటన్ నిపుణులు. గత 15 నెలలుగా పిల్లలు ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో వారు సీజనల్ ఫ్లూ జ్వరాలకు కారకమయ్యే వైరస్ల బారిన పడలేదు. దీని ఫలితంగా వారిలో కరోనా తర్వాత ఎదురయ్యే వ్యాధులతో పోరాడగలిగే రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందలేదని నిపుణులు తెలిపారు. రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ (ఆర్ఎస్వీ)పైనా వైరాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్కోసారి ఏడాదిలోపు పిల్లల్లో ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదముందని, ఈ వ్యాధికి టీకా కూడా లేదని వారు పేర్కొంటున్నారు. కరోనాకు ముందు రోజుల్లో దవాఖానాలకు తీసుకొచ్చే పిల్లల్లో ఎక్కువ మంది ఇతర సీజనల్ వ్యాధుల కంటే ఆర్ఎస్వీతో బాధపడే వారే ఉండేవారని గుర్తుచేస్తున్నారు.