బడంగ్పేట, జూన్17: ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో రూ. 1.10 కోట్ల వ్యయంతో వరద నీటి కాల్వల ఏర్పాటుకు మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గొలుసు కట్టు చెరువులను అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారని చెప్పారు. అందులో భాగంగానే కొంత మోని కుంట నుంచి గుర్రం చెరువు వరకు అవుట్ లెట్ డ్రైయిన్ ఏర్పాటు చేయడానికి రూ.10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టెండర్ ప్రక్రియను మొదలుపెట్టాలని, వర్షాకాలంలో పనులు చేయడానికి వీలు కాకపోతే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పనులు చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
గతంలో చెరువులు పూర్తిగా నిండి కాలనీ జలమయం అయిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా అవుట్ లేట్ సమస్యను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నామని ఆమె అన్నారు. ఇంటర్నల్ డ్రైయిన్ను అనుసంధానం చేయాలన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపల్లో ఉన్న అవుట్ లేట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. కాలనీలలో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించడానికి మెట్రో వాటర్వర్క్స్ అధికారులతో మాట్లాడుతానన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, జల్పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాదీ, బడంగ్పేట మున్సిపల్ కార్పోరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్ బండారి మనోహర్, ఎర్ర మహేశ్వరి జైయింద్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.