హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ నూతన సీఈవోగా నియమితులైన సత్య నాదెళ్ల.. హైదరాబాద్లో జన్మించారు. ఐఏఎస్ అధికారిగా పని చేసిన బీఎన్ యుగంధర్ తనయుడే సత్య నాదెళ్ల.
హైదరాబాద్లోని బేగంపేట పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించారు. అంతే కాదు మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశారు.. అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో 1990లో ఎంఎస్ పట్టా స్వీకరించారు.
1996లో యూనివర్సిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. అంతకుముందు 1992లో తన తండ్రి సహచర ఐఏఎస్ అధికారి కూతురు అనుపమను పెండ్లాడారు. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయనకు అనుపమ జూనియర్.
సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్.. అత్యంత నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 1962 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి యుగంధర్.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2004-09 మధ్య ప్రణాళిక సంఘం కార్యదర్శిగా సేవలందించారు.
అంతకుముందు పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు గ్రామీణావృద్ధి శాఖలో కీలక సంస్కరణలు తీసుకు వచ్చారు. ఆ సమయంలో వాటర్ షెడ్ల అభివృద్ధికి రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రం నుంచే నేరుగా జిల్లాలకే నిధులు వాచ్చేలా మార్గదర్శకాలు రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.