వనస్థలిపురం, మే 29: సూపర్ స్ప్రెడర్స్కు ప్రత్యేకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కోరారు. వనస్థలిపురం ఏరియా దవాఖానలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి మంత్రి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోందన్నారు. సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన వారు వెంటనే టీకాలు వేయించుకోవాలని సూచించారు. వనస్థలిపురంలో జరుగుతున్న వ్యాక్సినేషన్పై సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రియ, ఆర్ఎంవో సోమశంకర్, వైద్యులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్: అందరికీ టీకా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శనివారం చైతన్యపురిలోని గణేశ్ ఫంక్షన్ హాల్లో నిత్య సేవకుల వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనాను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. వ్యాక్సిన్ కోసం కేంద్రానికి వచ్చే ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ హరి కృష్ణయ్య, చైతన్యపురి సీఐ రవికుమార్, టీఆర్ఎస్ చైతన్యపురి డివిజన్ యువజన అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి , టీఆర్ఎస్ కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్గౌడ్, కిరణ్, బంటి సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్: కరోనా మహమ్మారిని తుద ముట్టించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్గుప్తా అన్నారు. శనివారం చైతన్యపురిలోని గణేశ్ ఫంక్షన్ హాల్లో నిత్య సేవకులకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన టీకా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వ్యాక్సిన్ వేసే సిబ్బందికి ఎమ్మెల్సీ మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించారు. ఆయన మాట్లాడు తూ జీహెచ్ఎంసీ వ్యాప్తంగా నిత్యం ప్రజలతో మమేకమై ఉండే వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్ వేయడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో సరూర్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య, టీఆర్ఎస్ కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు బొగ్గారపు శరత్చంద్ర, చంద్రశేఖర్, రిషి పాల్గొన్నారు.