రాంచీ: ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో యాస్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్నది. బుధవారం మధ్యాహ్నం ఒడిశా తీరాన్ని తాకిన తుఫాన్.. రెండు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. బలమైన ఈదురు గాలులు వీస్తుండటంతో పలుచోట్ల వృక్షాలు కూలిపోయాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలవల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది.
ఇవాళ జార్ఖండ్ రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం పడింది. ఈ ఉదయం నుంచి జార్ఖండ్ రాజధాని రాంచిలో భారీ వర్షం కురుస్తున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ఇదిలావుంటే తుఫాన్ ప్రభావంతో ఈ రోజంతా కూడా జార్ఖండ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకావం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.