హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ‘హలో భూమయ్యగారేనా? మేము తెలంగాణ కొవిడ్ కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది కదా? ఇప్పుడెలా ఉన్నారు? హోం ఐసొలేషన్లో ఉన్నారా? దవాఖానలో ఉన్నారా? మీకు ఏమైనా సహాయం కావాల్సి వస్తే మా నంబర్ 040-24225500కు ఫోన్ చేయండి. అంటూ ప్రతిరోజూ వందల మంది కరోనా రోగులను తెలంగాణ ప్రభుత్వం పలకరిస్తున్నది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికీ కొవిడ్ కాల్ సెంటర్ నుంచి ఫోన్ కాల్ వెళ్తున్నది. కొవిడ్ రోగులతో కాల్ సెంటర్ ఉద్యోగులు చాలా మర్యాదగా మాట్లాడుతూ వారికి సాంత్వన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. రోగి ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? మందులు వాడుతున్నారా? బలవర్ధకమైన ఆహారం తీసుకుంటున్నారా? ఆక్సిజన్ అవసరం ఉందా? అని వాకబు చేస్తూ.. ‘మీకు దగ్గరలో ఫలానా దవాఖాన ఉన్నది. ఏదైనా అత్యవసరమైతే ఆ దవాఖానకు వెళ్లండి. లేదంటే మా కాల్ సెంటర్కు ఫోన్ చేయండి. మేమే మీకు బెడ్ను, అంబులెన్స్ను ఏర్పాటు చేస్తాం’ అని భరోసా ఇస్తున్నారు. అంతేకాకుండా రోగులెవరైనా తమకు డాక్టర్ కన్సల్టేషన్ కావాలని అడిగితే వెంటనే ఏర్పాటు చేయడంతోపాటు కరోనా బాధితుల ఈ-కేస్ షీట్ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇది అచ్చంగా దవాఖానలో ఉండే కేస్ షీట్ మాదిరిగానే ఉంటుంది.
కొవిడ్ పాజిటివ్ ఎప్పుడు వచ్చింది? ఎలాంటి లక్షలతో ఉన్నారు? ఆ లక్షణాలు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి? అనే వివరాలన్నింటినీ ఈ-కేస్ షీట్లో పొందుపర్చి తొలి రోజు నుంచి 14వ రోజు వరకు ఫాలోఅప్ చేస్తున్నారు. అంతేకాకుండా రోగులకు మందుల కిట్ను అందించి వాటిని ఎలా వాడాలో.. ఆక్సిజన్ లెవల్ తగ్గితే ఏం చేయాలో వివరిస్తున్నారు. పాజిటివ్ కేసుల్లో 60 ఏండ్లు పైబడినవారు ఎంతమంది ఉన్నారు? చిన్న పిల్లలు, యువత ఎంత మంది ఉన్నారన్న వివరాలను సేకరిస్తున్నారు. అలాగే, పాజిటివ్ వచ్చిన వారి ప్రాంతం, వారు ఎక్కడ ఉంటున్నారు? వారి ఇంట్లో ఇప్పటి వరకు ఎంతమందికి పాజిటివ్ వచ్చింది? అనే వివరాలతోపాటు రోగులు ఏ భాష మాట్లాడుతున్నారన్న వివరాలను కూడా సేకరించి వారితో అదే భాషలో మాట్లాడగలిగే డాక్టర్లను, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఈ తరహా కాల్ సెంటర్ ఒక్క తెలంగాణాలోనే ఉన్నది. ఇదో వినూత్న ఆలోచనగా అధికారులు చెప్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది మాట్లాడుతున్న తీరుపై రోగులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.