న్యూఢిల్లీ : ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్విట్టర్ వేదికగా ‘కాంగ్రెస్ టూల్కిట్’ పేరుతో చేసిన ట్వీట్లపై ఆ సంస్థ సోషల్ మీడియా దిగ్గజం స్పందించింది. ఆయన చేసిన ట్వీట్లు అవాస్తవమని స్పష్టం చేసింది. టూల్కిట్ వ్యవహారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అకౌంట్లను నిలిపివేయాలని కాంగ్రెస్ గురువారం ట్విట్టర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ‘కొవిడ్-19 టూల్కిట్’ పేరుతో సమాజంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించింది.
నకిలీ పత్రాలను సృష్టించి వ్యాప్తి చేస్తున్న నలుగురు బీజేపీ నేతల ఖాతాలను శాశ్వతంగా నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు ట్విట్టర్ స్పందించింది. ఈ మేరకు సంబంధిత ట్వీట్లను మేనిప్యులేటెడ్ మీడియాగా పేర్కొంది. అవాస్తవమైన వీడియోలు, ఆడియోలు, ఫొటోలను ట్విట్ చేస్తే చర్యలు చేపడతామని ట్విట్టర్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై తప్పుడు పత్రాలు సృష్టించి తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ఓ ‘నకిలీ టూల్కిట్’ను సృష్టించిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.