అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోమ్ఐసోలేషన్లో ఉన్నారాయన. ఈ సందర్భంగా కరోనా నుంచి తాను కోలుకుంటున్నానని, త్వరలో ఈ మహమ్మారిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తానని తెలిపారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎలాంటి సంబరాలు చేయవద్దని పిలుపునిచ్చారు. వేడుకలు చేసుకునే సమయం ఇది కాదని, కరోనాతో చేస్తోన్న యుద్దంలో ప్రాణాలను, జీవనోపాధిని కోల్పోయిన కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని అన్నారు. ఈ మేరకు బుధవారం ఎన్టీఆర్ ఓ ప్రకటనను విడుదలచేశారు. ‘ప్రతి ఏటా మీరు నా పుట్టినరోజున చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఆశీర్వచనంగా భావిస్తా. కానీ ఈ ఏడాది మీరు ఇంటి పట్టునే ఉంటూ లాక్డౌన్, కర్ఫ్యూ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నా. అదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక. ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. మన దేశం కరోనాతో యుద్ధ్దం చేస్తోంది. కనిపించని శత్రువుతో అలుపెరుగని పోరాటం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్లైన్ వారియర్స్కు అందరూ సంఘీభావం తెలపాలి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. త్వరలో మన దేశం ఈ కరోనాను జయిస్తుంది అని నమ్ముతున్నా. ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందాం’ అని ఎన్టీఆర్ తెలిపారు.