ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నికరలాభం మార్చితో ముగిసిన నాల్గో త్రైమాసికంలో 29 శాతం క్షీణించి రూ. 557 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 781 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో నికర అమ్మకాల ఆదాయం మాత్రం రూ.4,336 కోట్ల నుంచి రూ. 4,608 కోట్లకు చేరింది. 2020-21 పూర్తి ఆర్ధిక సంవత్సరంలో నికరలాభం రూ. 2,026 కోట్ల నుంచి రూ.1,952 కోట్లకు తగ్గగా, అమ్మకాల ఆదాయం రూ. 16,357 కోట్ల నుంచి రూ. 18,420 కోట్లకు చేరింది. క్యూ4లో కంపెనీ నిరుత్సాహకర పనితీరుకు కారణం భారీ మార్కెట్ అయిన ఉత్తర అమెరికాలో అమ్మకాలు 3 శాతం క్షీణించడమే. అక్కడ అమ్మకాలు రూ. 1,749 కోట్లుగా నమోదయ్యాయి. భారత్లో అమ్మకాలు 23 శాతం వృద్ధితో రూ.845 కోట్లకు చేరగా, యూరప్ అమ్మకాలు 15 శాతం పెరిగి రూ. 395 కోట్లకు చేరాయి. ఇతర వర్థమాన మార్కెట్లలో అమ్మకాల ఆదాయం 10 శాతం వృద్ధిచెంది రూ. 845 కోట్లకు పెరిగింది.