‘తుది శిశిరం వస్తున్నది/ పాడుగాలి వీస్తున్నది; పూలపతాకాలనెత్తి, కోకిల బాకాలనొత్తి/ఎదిరింతాం సాగిరండు, తుది శిశిరం కూలు లెండు’ అంటూ… కీడుకాలం ఎంతోకాలం ఉండబోదని, అది తుది దశకు చేరుకున్నదని, అందరం కలిసికట్టుగా కదిలితే వసంతం విరబూసినట్లుగా సమాజం సుఖ సంతోషాలతో నిండుతుందని తెలంగాణ వైతాళికుడు దాశరథి ప్రజలకు పిలుపునిచ్చాడు. కష్టకాలంలో కలిసి నడువకుండా, విద్వేషాలతో అనైక్యతతో ఉంటే పాడుకాలాన్ని పారదోలటం అసాధ్యమని మార్గనిర్దేశం చేశాడు. కానీ మహనీయుల మాటలకు ఏనాడు విలువ ఇచ్చామని! విపత్తు సమయాల్లోనూ ఐక్యంగా ఆలోచించకుండా కొందరు మేధావులు- రాజకీయ పార్టీలు వ్యవహరించటం బాధ్యతారాహిత్యం. కరోనా నియంత్రణ, సహాయక చర్యల్లో కూడా రాజకీయాలు జొప్పిస్తున్న తీరు అభ్యంతరకరం.
కరోనా మహమ్మారి యావత్దేశాన్నీ సంకటంలోకి నెట్టింది. దేశ వ్యాప్తంగా వైరస్ పాజిటివిటీ రేటు 20 శాతానికి మించిపోయి భయకంపితుల్ని చేస్తున్నది. పాజిటివిటీ పది శాతానికి మించి ఉంటే సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించాల్సిన అగత్యం ఉంటుందని జాతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) సూచిస్తున్నది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాలతో పాటు, దేశంలో 500లకు పైగా జిల్లాల్లో పాజిటివిటీ ప్రమాదకర స్థాయిలో ఉన్నది. ఇలాంటి సమయంలో ప్రజల ప్రాణరక్షణ కోసం కరోనా సంబంధిత ఔషధాలు, ఆక్సిజన్ సరఫరాతో పాటు, వ్యాక్సిన్లు, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఎన్నికావాలో డిమాండ్ చేయాలి. అధికార యంత్రాంగానికి తోడుగా తామూ నివారణ చర్యల్లో పాల్గొంటామని ముందుకు రావాలి. ఎవరికి తోచిన సాయం వారు అందించాలి. పౌరులతో పాటు ప్రైవేటు వైద్య నిపుణులు, సంఘ సేవకులు, ప్రజాప్రతినిధులు, సంకుచిత భావజాలాలకు అతీతంగా కలిసి కదలాలి. కానీ కంట్లో నలుసు పడ్డదంటే.. అరికాలుకు ఆకు పసరు పూసిన చందం మన విపక్షాల తీరు.
ప్రస్తుత విపత్తుకు ఎవరి బాధ్యత ఎంత అన్నదానిపై రంధ్రాన్వేషణకు ఇది సమయమూ, సందర్భమూ కాదు. ఆపత్కాలం అందరినీ ఒకటి చేస్తుందంటారు. ఇప్పుడు దేశం కరోనా కాటుతో ఆపదలో ఉన్నది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రతి ఇంట్లో రోగులు, ప్రపంచమే ఆస్పత్రిగా మారిన సంక్షోభ సమయం ఇది. ఉన్న వనరులను అందిపుచ్చుకొని ప్రజలను సంరక్షించుకోవటమే అందరి కర్తవ్యం కావాలి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ చర్యలపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేయటం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు చికిత్స బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు ఐదింతలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు 27వేల బృందాలు 60లక్షల ఇండ్లలో ఆరోగ్య సర్వే చేసి అవసరమైన వారికి మెడికల్ కిట్లు అందించి బృహత్తర కార్యాన్ని నెరవేరుస్తున్నారు. దాశరథి అన్నట్లు.. ‘రెండు కళ్లు చూపు ఒకటి, రెండు కాళ్లు నడక ఒకటి’గా ఇప్పుడు కలిసి నడువాలి. కరోనాపై విజయం సాధించాలి.