దేశమంతా కరోనాతో కకావికలమవుతున్న వేళ సైబర్ నేరస్తులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల బలహీనతలే తమ బలంగా గాలం విసురుతున్నారు.కొవిడ్ టెస్టింగ్, వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్, ఔషధాల పేరుమీద లక్షల్లో అకౌంట్లను కొల్లగొడుతున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.
టెస్టింగ్ పేరు మీద వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మొద్దు. కొవిడ్ టెస్ట్ చేస్తామంటూ ఆన్లైన్ పేమెంట్ వసూలు చేస్తున్నారు కొందరు. కొన్ని సందర్భాల్లో శాంపిల్ సేకరణ కోసం ఇంటికే వస్తున్నారు. శాంపిల్ సేకరించి, ఫీజు వసూలు చేసుకొని వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత వారాలు దాటినా ఏ రిపోర్ట్ రాదు. ఇలాంటి కేసులు చాలా చోట్ల నమోదవుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్)లో అప్రూవ్ చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్స్లోనే పరీక్షలు చేసుకోవాలి. ఏదైనా పరీక్షా కేంద్రం నుంచి సందేశం వస్తే.. ఆ పేరు ఐసీఎమ్ఆర్ ఆమోదించిన జాబితాలో ఉందేమో చెక్ చేయాలి.
ఆన్లైన్లో వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేసుకుంటున్నారా! ఇందుకోసం ప్లేస్టోర్లోకి వెళ్లి యాప్లు డౌన్లోడ్ చేస్తున్నారా! తొందరపడి ఏదో ఒకటి డౌన్లోడ్ చేసేయకండి. ప్రభుత్వం ప్రకటించిన కో-విన్ పేరుతో రకరకాల యాప్స్ ప్లేస్టోర్లో తిష్టవేశాయి. వాటిని డౌన్లోడ్ చేసుకున్నారా, అంతేసంగతులు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా, ఆరోగ్యసేతు యాప్ ద్వారా మాత్రమే వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి.