హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు తమ ఆరోగ్య పరిరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్ లు, ఎస్పీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్ల ఇన్చార్జీలు, అడిషనల్ ఎస్పీలతో శనివారం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ఏ పోలీస్ అధికారికైనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు తేలితే వారికి ప్రారంభం నుండే తగు వైద్య చికిత్సలు అందించాలని కంట్రోల్ రూమ్ అధికారులను ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వారికి ప్రత్యేక ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేసి డాక్టర్ల సూచన మేరకు మందులు అందించడంతో పాటు బలవర్ధకమైన ఆహారాన్ని కూడా అందించాలన్నారు. తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏ పోలీసు అధికారికి అయినా అత్యయిక పరిస్థితి ఎదురైతే వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్పించాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ కొవిడ్తో మరణించే స్థితికి పరిస్థితులు దిగజారకుండా ముందునుండే జాగ్రత్తలు చేపట్టాలన్నారు. పాజిటివ్ వస్తే ఏవిధమైన చికిత్సనైనా సరే అందించి ప్రమాదం లేకుండా చూడాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, డీఐజీ బి.సుమతి తదితరులు పాల్గొన్నారు.