సుల్తాన్బజార్, ఏప్రిల్ 18 : కార్పొరేట్కు దీటుగా బస్తీ దవాఖానలలో వైద్యసేవలు అందుతుండటంతో రోజురోజుకూ ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. బస్తీల వారీగా ప్రజలకు వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటుచేసింది. ఈ బస్తీ దవాఖానలలో సాధారణ జబ్బులకు కూడా వైద్య చికిత్సతో పాటు రక్త పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ చేస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ దవాఖానలలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారని, బస్తీ దవాఖానల్లో మాత్రం పైసా ఖర్చు లేకుండా వైద్యసేవలు అందిస్తుండటంతో ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
స్థానిక ప్రజలను చిన్నచిన్న జబ్బులకే పట్టిపీడిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానల దోపిడి నుంచి ప్రజలకు మెరుగైన వైద్యసేవలను ఉచితంగా అందించాలనే యోచనతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో బస్తీ దవాఖానలను మెరుగుపర్చారు. ఈ కోవలోనిదే హనుమాన్ టేక్డీ బస్తీ దవాఖాన. ఈ దవాఖానలో ప్రధానంగా జ్వరం, దగ్గు, జలుబు, డయాబెటీస్, హైపర్టెన్షన్, కార్డియాక్, ఏఎంసీ, గైనిక్ సమస్యలపై వైద్య చికిత్సలు అందిస్తున్నారు. బస్తీ దవాఖానలకు వచ్చే రోగులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కింగ్ కోఠి క్లస్టర్ పరిధిలోని హనుమాన్టేక్డీ బస్తీ దవాఖాన పరిధిలో మొత్తం 2 వేలకు పైగా జనాభా కలిగి ఉన్నారు. నిత్యం 60 నుంచి 80 మంది రోగులు దవాఖానకు ఓపీ పేషెంట్లుగా వచ్చి వైద్య చికిత్సలు పొందుతున్నారని బస్తీ దవాఖానాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నెహ్రా చెబుతున్నారు.
హనుమాన్ టేక్డీ బస్తీ దవాఖాన ఏర్పాటుతో స్థానిక ప్రజలకు వైద్య చికిత్స కోసం ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించాల్సిన అవసరం పోయింది. ఈ బస్తీ దవాఖాన అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు దవాఖానలో ఎంతో ఉత్సాహంగా వైద్య సేవలు పొందుతున్నారు. అత్యధికంగా షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాల్లో పనిచేసే వారు అధికంగా వస్తారని డాక్టర్ నెహ్రా తెలిపారు. దవాఖానకు వచ్చిన వారికి పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా అత్యవసరమైన వారికి పెద్ద దవాఖానలకు పంపించి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని డాక్టర్ నేహ్రా తెలిపారు. ప్రతి నెల ప్రారంభంలో బస్తీ దవాఖానలకు 80 నుంచి వంద మంది వరకు వస్తుంటారన్నారు.