ముంబై: దూది, పీచు, స్పాంజి బదులు వాడేసిన మాస్కులతో పరుపులు తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీ నిర్వాకం రట్టయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సోదాలు చేసి గుట్టలుగా ఉన్న వాడేసిన మాస్కులను కాల్చివేశారు. ఆ కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) పరిధిలోని కుసుంబ గ్రామంలో ఒక పరుపుల తయారీ కేంద్రంలో వాడేసిన మాస్కులతో పరుపులు తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి తనిఖీ చేశారు. గుట్టలుగా ఉన్న వాడేసిన మాస్కులను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే వాటిని తగులబెట్టారు. ఆ ఫ్యాక్టరీ యజమాని అమ్జాద్ అహ్మద్ మన్సూరిపై కేసు నమోదు చేశారు. ఈ రాకెట్లో ఎంతమంది పాత్ర ఉన్నది అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో ప్రతి రోజు 1.5 కోట్లకుపైగా మాస్కులు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బయో మెడికల్ వ్యర్థాలు భారీగా పేరుకుపోతున్నాయి. కాలుష్య నియంత్రణ సంస్థ గణాంకాల ప్రకారం గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాస్కులు, చేతి తొడుగులు వంటి వ్యర్థాలు 18 వేల టన్నులకు చేరాయి.