కోల్కతా : ప్రభుత్వ రంగ సంస్ధలను కేంద్ర ప్రభుత్వం తెగనమ్ముతోందని ప్రధాని నరేంద్ర మోదీ అసత్యాల ఫ్యాక్టరీ ఒక్కటే మిగిలి ఉంటుందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో పురూలియా జిల్లాలో మంగళవారం జరిగిన ప్రచార ర్యాలీని ఉద్దేశించి దీదీ ప్రసంగించారు. బెంగాలీలకు భారీ హామీలు గుప్పిస్తున్న కాషాయ పార్టీ గతంలో అసోం, త్రిపుర ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను ఆపై తుంగలో తొక్కిందని ఆరోపించారు. రెండు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు వేలాది ప్రభుత్వోద్యోగులను నిరుద్యోగులుగా మార్చారని దుయ్యబట్టారు.
కేంద్ర పాలకులు ప్రభుత్వ రంగ సంస్ధలన్నింటినీ మూసివేస్తున్నారు. చివరికి నరేంద్ర మోదీ, బీజేపీ అసత్యాల ఫ్యాక్టరీ ఒక్కటే మిగిలిఉంటుందని దీదీ ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీ భావోద్వేగాలకు లొంగకుండా ప్రజలు మత రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. బయటనుంచి వచ్చిన గూండాలకు ఓటు వేయవద్దని ప్రజలకు ఆమె విజ్క్షప్తి చేశాడు. తనను అణగదొక్కాలని చూసినా బెదిరించినా వెనక్కు తగ్గబోనని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బయటి వ్యక్తులను రాష్ట్రానికి తీసుకువస్తోందని మమతా బెనర్జీ పలు సందర్భాల్లో ఆరోపించారు.