“తెల్లవారితే గురువారం’ చిత్రంలో తన నిజ జీవితానికి దగ్గరుండే పాత్రను పోషించానని చెప్పింది కథానాయిక మిషా నారంగ్. శ్రీసింహా కోడూరి హీరోగా మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలకానుంది. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ నిర్మాతలు. ఈ సందర్భంగా మిషా నారంగ్ మాట్లాడుతూ ‘నా స్వస్థలం హర్యాణాలోని కురుక్షేత్ర. కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ చేశాను. ఈ సినిమాలో నేను మధు అనే చలాకీ అమ్మాయి పాత్రలో కనిపిస్తా. వినోదంతో పాటు భావోద్వేగభరితంగా నా పాత్ర సాగుతుంది. వివాహ వేడుక నేపథ్యంలో ఆద్యంతం వినోదప్రధానంగా నడిచే కథ ఇది. తెలుగు హీరోల్లో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నా. అభినయప్రధాన పాత్రల్ని పోషించి ప్రేక్షకుల మెప్పు పొందాలనుకుంటున్నా’ అని చెప్పింది.