పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్ర ం
ప్రాంతీయ ఆఫీసుతోనే సరిపెట్టుకోవాలి
ఎంపీ సురేశ్రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు
నిజామాబాద్కు బీజేపీ నమ్మకద్రోహం
బాండ్ రాసి తప్పించుకున్న ఎంపీ అర్వింద్
ఏడాదిన్నర డ్రామాలకు బీజేపీ సర్కారు తెర
బోర్డు సాధించేవరకు ఉద్యమిస్తాం: రైతులు
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ)/నిజామాబాద్ ప్రతినిధి: నిజామాబాద్లో పసుపు బోర్డు పెట్టేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పటికే ఏర్పాటుచేసిన సుగంధ ద్రవ్యాల (స్పైసెస్) బోర్డు రీజినల్ ఆఫీస్తో సరిపెట్టుకోవాలని సూచించింది. దేశంలోనే అత్యధికంగా పసుపు పండిస్తున్న తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయంచేసింది. వంద రోజుల్లో బోర్డు సాధిస్తామంటూ ఓట్లు దండుకొని.. గెలిచిన తర్వాత మాయమాటలు చెప్తూ మభ్యపెడుతున్న ఎంపీ ధర్మపురి అర్వింద్, రాష్ట్ర బీజేపీ నేతల బండారం పార్లమెంట్సాక్షిగా బట్టబయలైంది. వారివన్నీ బోగస్ హామీలని తేలిపోయింది. తెలంగాణలో పసుపుబోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి రెండు వారాల క్రితం రాజ్యసభలో వేసిన ప్రశ్నకు.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ నెల 12న కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం సోమవారం ఎంపీ సురేశ్రెడ్డి వద్దకు చేరింది. తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటుచేసే ప్రతిపాదనలేదని ఆ లేఖలో కేంద్రమంత్రి స్పష్టంచేశారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ లో పసుపు పండుతున్నదని చెప్తూనే.. బోర్డుమాత్రం ఏర్పాటు చేయబోమన్నారు. పసుపుతోపాటు హార్టికల్చర్ సాగులో సహాయం చేసేందుకు ఇప్పటికే అనేక పథకాలు అమలుచేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్యశాఖ ఇప్పటికే నిజామాబాద్లో స్పైసెస్ బోర్డు రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటుచేసిందని గుర్తుచేశారు. పసుపుతోపాటు ఇతర సుగంధ ద్రవ్యాల ఎగుమతికి ప్రచారంకోసం తెలంగాణలో వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో బోర్డు కార్యాలయాలు ఉన్నాయన్నారు.
నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గపరిధిలో సుమారు 80 వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతున్నది. నిర్మ ల్ జిల్లాలోనూ సాగుచేస్తారు. తమకు గిట్టుబాటుధర లభించేలా నిజామాబాద్ కేంద్రంగా బోర్డు ఏర్పాటుచేయాలని ఇక్కడి రైతులు సుమారు మూడున్నర దశాబ్దాలుగా కోరుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత.. గత లోక్సభలో ఎంపీగా ఉన్నప్పుడు రైతుల పక్షాన పలుమార్లు కేంద్రమంత్రులను కలిశారు. అయినా కేంద్రం స్పందించలేదు. పైగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ కొత్త డ్రామాకు తెరలేపారు. తనను గెలిపిస్తే ఐదురోజుల్లోనే పసుపు బోర్డు సాధిస్తానని హామీ ఇచ్చి.. బాండ్పేపర్ రాసిచ్చారు. బీజేపీ నేతల మాటలు నమ్మిన నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులంతా ఎంపీ అర్వింద్ను గెలిపించారు. రైతు లు ఎక్కడికక్కడ నిలదీస్తుండటంతో కొత్త డ్రామా తెరమీదికి తీసుకొస్తున్నారు. బోర్డు పెట్టేది లేదని కేంద్రం చెప్పిననేపథ్యంలో అర్వింద్ ఎంపీ పదవికి రాజీనామాచేయాలని రైతులు డిమాండ్చేస్తున్నారు.
నిజామాబాద్లో ఏర్పాటుచేసిన స్పైసెస్ బోర్డు ప్రాంతీయ విస్తరణ కార్యాలయం ఏర్పాటు కొత్తదేమీ కాదు. ఎమ్మెల్సీ కవిత గతంలోచేసిన పోరాటానికి దక్కిన ఫలితమది. ఆమె పలుమార్లు ప్రధాని మోదీని కలిసి బోర్డుకోసం విన్నవించారు. 2017లో నాటి వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎంపీ కవిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని నిజామాబాద్లో స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా, కవిత తిరస్కరించారు. అదే ప్రకటనను 2020 ఫిబ్రవరి 5న కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్తో ఎంపీ అర్వింద్ చెప్పించారు. జూలైలో ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఏర్పాటుచేశారు. స్పైసెస్బోర్డు రీజినల్ ఆఫీస్తో రైతులకు ఒరిగేదేమీ ఉండదు. ఇక్కడి అధికారులకు ఎలాంటి అధికారాలు ఉండవు.
ఎంపీ అర్వింద్ తను స్వయంగా రాసిచ్చిన బాండ్ పేపర్ను, హామీని గాలికి వదిలేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే కనిపించిన చోటల్లా నిలదీస్తున్నారు. ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలంటూ జనవరి 9న ఆర్మూర్ శివారు మామిడిపల్లి వద్ద 8 గంటలపాటు హైవేను దిగ్బంధించారు. పలు పర్యటనల్లోనూ ఎంపీ అర్వింద్ను పసుపు రైతులు అడ్డుకున్నారు. జనవరి 23న కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలో పసుపు రైతులతో ముఖాముఖికి వచ్చి మాయమాటలు చెప్పారు. అ క్కడా రైతులు నిలదీయడంతో వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. తాజాగా బోర్డు పెట్టేది లేదని కేంద్రం తేల్చేసిన నేపథ్యంలో ‘ఇప్పు డేం చెప్తావ్ అర్వింద్?’ అని నిలదీస్తున్నారు. ఎక్కడ కనిపించినా కడిగేస్తామని స్పష్టంచేస్తున్నారు.
దేశంలో అత్యధికంగా పసుపు పండిస్తున్నది తెలంగాణే. దేశంలో ఉత్పత్తి అవుతున్న పసుపులో మూడింట ఒకవంతు రాష్ట్రం నుంచే వస్తున్నది. 2019-20లో దేశవ్యాప్తంగా 1,153 టన్నుల పసుపు ఉత్పత్తి కాగా ఇందులో తెలంగాణ వాటా 386.5 టన్నులు (33.5 శాతం). అంతేకాదు.. సగటు ఉత్పత్తిలోనూ తెలంగాణ టాప్లో ఉన్నది. రైతులు శ్రమించి ఒక్కో హెక్టారుకు సగటున 6,973 కిలోల పంట తీశారు. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడు ఉన్నాయి.
పసుపు రైతులను బీజేపీ ప్రభుత్వం దగాచేసింది. బోర్డు తెస్తానని మాటిచ్చిన ఎంపీ అర్వింద్ ఇప్పటికే తప్పించుకు తిరుగుతున్నారు. చివరకు ఏదీ తేలేకపోవడం ఆయన చేతకాని తనానికి నిదర్శనం.
-సురేశ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు