జకార్తా: ఆహారం కోసం ఆశగా నీటి ఏనుగు నోరు తెరువగా ఒక మహిళా పర్యాటకురాలు ప్లాస్టిక్ బాటిల్ విసిరింది. మూగజీవి హిప్పో పట్ల దారుణంగా వ్యవహరించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆ మహిళ చర్యపై మండిపడ్డారు. ఇండోనేషియా పశ్చిమ జావాలోని తమన్ సఫారీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. అరి అనే హిప్పో ఆహారం కోసం ఆశతో నోరు తెరువగా, వాహనంలో సఫారి చేస్తున్న ఒక మహిళ దాని నోట్లోకి ప్లాస్టిక్ డ్రింక్ బాటిల్ విసిరింది. దీంతో అది దాని గొంతులో పడింది. అనంతరం ఆమె ఒక టిష్యూ పేపర్ కూడా విసరగా అది హిప్పో పక్కన పడింది.
మరోవైపు ఆ వాహనం వెనుకే ఉన్న వాహనంలో సఫారీ చేస్తున్న సింటియా ఆయు అనే మహిళా టూరిస్ట్ దీనిని వీడియో తీశారు. ఆ మహిళ వాహనాన్ని అనుసరించి నిలువరించేందుకు ఆమె ప్రయత్నించారు. అంతలో ఒక సెక్యూరిటీ గార్డు కనిపించగా ఈ విషయాన్ని ఆయనకు చెప్పారు. దీంతో ఆ వ్యక్తి హిప్పో నోటిలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ను తొలగించారు. ఇంతలో ఈ చర్యకు పాల్పడిన మహిళ వాహనం కనుమరుగైంది.
ఈ ఘటన అనంతరం సింటియా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. హిప్పోల ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి చర్యలను నివారించాలని కోరారు. మరోవైపు ఈ వీడియో వైరల్ కాగా, హిప్పో నోట్లోకి ప్లాస్టిక్ బాటిల్ విసిసిన మహిళపై నెటిజన్లు మండిపడ్డారు.