కోల్కతా: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులను ఉసిగొల్పడం ద్వారా బీజేపీ తనను బెదిరించలేదని తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జి స్పష్టంచేశారు. ఒక నేత విషయంలో బీజేపీ ఇదేపని చేసిందని, తన విషయంలో మాత్రం ఈ బెదిరింపులు సాగవని ఆయన పేర్కొన్నారు. వెస్ట్ మిడ్నాపూర్లో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన అభిషేక్ బెనర్జీ.. ‘బెదిరించి ఆయనను (సువేందు అధికారి) బీజేపీలోకి లాక్కుకున్నట్టే నన్ను కూడా ఈడీ, సీబీఐలతో బెదిరించగలమని బీజేపీ అనుకుంటోంది. అయితే, మేమిద్దరం మనుషులమే. కానీ మా వెన్నెముకల్లో వ్యత్యాసం ఉంది. ఆయన (సువేందు) తన వెన్నెముకను అమ్ముకున్నారు. నేను మాత్రం నా వెన్నెముకను అమ్మకానికి పెట్టను. పెట్టినా కొనే సత్తా వాళ్లకు లేదు’ అంటూ బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు.
తన గొంతు కోసినా జై హింద్, జై బంగ్లా, జై మిడ్నాపూర్, జై మమతా బెనర్జి, తృణమూల్ కాంగ్రెస్ జిందాబాద్ అనే నినాదాలను మానబోనని ఆయన స్పష్టం చేశారు. బొగ్గు కుంభకోణంలో ఇటీవల సీబీఐ బృందం అభిషేక్ నివాసానికి వెళ్లి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆయన భార్యకు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీపై అభిషేక్ బెనర్జి విమర్శల వర్షం గుప్పించారు.