మహబూబాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : మానుకోటలో మెడికల్ హబ్ వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ప్రభుత్వం మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. వీటి నిర్మాణానికి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ సమీపంలో స్థలం కేటాయించారు. సర్వే నంబర్ 551లో 48 ఎకరాల స్థలంలో మెడికల్ కళాశాల నిర్మించనున్నారు. ఈ స్థలాన్ని ఇప్పటికే మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్, జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు పరిశీలించారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సైతం వచ్చి పరిశీలించి, ఆమోద ముద్ర వేశారు. ఎంపిక చేసిన స్థలంలో రెవెన్యూ అధికారులు రెండు రోజులుగా సర్వే చేస్తూ చుట్టూ హద్దులు పాతుతున్నారు. త్వరలోనే ఈ స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అప్పగించనున్నారు. రెండు రోజులుగా రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు హద్దురాళ్లు పాతే పనిలో నిమగ్నమయ్యారు. స్థలం చుట్టూ ఉన్న ప్రైవేట్ భూముల యజమానులు సైతం హద్దులు పాతుకుంటున్నారు. గురువారం రాత్రి వరకు హద్దులు చూపే పనిని అధికారులు పూర్తి చేశారు.
పెరిగిన భూముల ధరలు
మెడికల్ కళాశాల స్థలం సమీపంలోని భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా ఇక్కడ భూముల ధరలు పెరుగడంతో స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ కార్యాలయ సమీపంలో మెడికల్ కళాశాలకు స్థలం కేటాయించడంతో జిల్లా కేంద్రం నుంచి శనిగపురం వరకు భూములకు ధరలు పెరిగాయి. రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు చుట్టు పక్కల భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంబంధిత స్థలం నుంచి చుట్టూ ఐదు కిలోమీటర్ల వరకు భూముల రేట్లు పెరిగాయి.
పత్తి ధర@ రూ.8,060
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం రికార్డు స్థాయిలో పత్తి ధర పలికింది. ఈ సీజన్లోనే అత్యధికంగా రూ.8,060 ధర పలికింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన గుండేకారి బాబురావు అనే రైతు 17 బస్తాల పత్తిని తీసుకురాగా, శ్రీవినాయక ఎంటర్ప్రైజెస్ అడ్తి ద్వారా భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ కాటన్ ఖరీదు వ్యాపారి క్వింటాల్కు రూ.8,060 ధరతో కొనుగోలు చేశారు. ఈ సీజన్లోనే అత్యధికంగా గురువారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్ తెలిపారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్కు 17,01,738 క్వింటాళ్ల పత్తి రాగా గురువారం 979 క్వింటాళ్లు వచ్చినట్లు పేర్కొన్నారు. క్వింటాల్కు అత్యధికంగా రూ.8,060, మధ్య రకానికి గరిష్ఠంగా రూ.7,050, కనిష్ఠంగా రూ.6,025 ధర పలికినట్లు వివరించారు.