నెల్లికుదురు, అక్టోబర్ 8 :వ్యవసాయం కొందరికి కలిసొస్తుంది. మరికొందరికి ఎంత కష్టం చేసినా ఫలితం ఉండదు. మూసపద్ధతిలో పంటలు సాగుచేసి నష్టాలు చూస్తుంటారు. కానీ, నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామ రైతు రూపిరెడ్డి గోపాల్రెడ్డి మాత్రం వినూత్నమైన ఆలోచనలతో వైవిధ్యమైన పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందుతున్నాడు. నూతన వంగడాలను పరిచయం చేస్తూ, పెట్టుబడి, శారీరక శ్రమను తగ్గించి, సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఆలేరు గ్రామానికి చెందిన రైతు రూపిరెడ్డి గోపాల్రెడ్డి వయసు 57 సంవత్సరాలు. వ్యవసాయం అంటే వల్లమాలిన కాయిసు. అందరిలా మూసపద్ధతిలో కాకుండా వినూత్నమైన ఆలోచనలతో, సాంకేతికతను జోడించి పంటలు సాగు చేస్తున్నాడు. మార్కెట్లో ఏ పంటలకు డిమాండ్ ఉంటుందో ముందుగానే అంచనా వేసి వాటినే సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. పసుపు, మిరుప, మక్కజొన్న, పప్పుదినుసుల వంటి పంటల కోసం పరిశోధనా కేంద్రాల నుంచి నూతన వంగడాలను తీసుకొచ్చి మొదట తన భూమిలో సాగు చేసి, వాటి ప్రత్యేకతపై తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. పెంటమట్టి, ట్రైకోడెర్మా, అజాటో బ్యాక్టర్ వంటి శిలీంద్రాలను వాడుతున్నాడు. పెట్టుబడి, శారీరక శ్రమను తగ్గించడానికి బిందుసేద్యం, మల్చింగ్, ఫర్టిగేషన్ తదితర నూతన సాంకేతికతను వినియోగిస్తున్నాడు. పసుపు పంటలో తక్కువ కాల వ్యవధి ఉన్న వంగడాలు ఏసీసీ-48, ఏసీసీ-79 విత్తనాలు లాభదాయకంగా ఉండడంతో తాను సాగు చేస్తూ, తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. గోపాల్రెడ్డి తనకున్న పది ఎకరాల భూమిలో పప్పుదినుసులు, కూరగాయలు, తేజమిర్చి, క్యాబేజీ, స్వీట్ కార్న్, బంతిపూలు, పుచ్చకాయ, పసుపు తదితర పంటలు సాగు చేస్తూ లాభాలు పొందుతున్నాడు. 2020లో అప్పటి కలెక్టర్ శివలింగయ్య, 2021లో కలెక్టర్ గౌతమ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ గోపాల్రెడ్డి చేస్తున్న కృషిని గుర్తించి అభినందించారు. ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు.
చిన్న చిన్న చిట్కాలు పాటించాలి
సాగులో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరుగుతుంది. మార్కెట్లో డిమాండ్ పంటలను సాగు చేయాలి. ఎక్కువ పండించడం కాదు.. నాణ్యమైన, డిమాండ్ పంటలను పండిస్తే రైతు నష్టపోడు. మూస పద్ధతిలో కాకుండా టెక్నాలజీని ఉపయోగించాలి. వ్యవసాయంలో శాస్త్రం ఉంది.., సాంకేతికత ఉంది. ఈ రెండింటికి మనకున్న అనుభవాన్ని జోడిస్తే సాగు పండుగే అవుతుంది.