గర్భిణులకు అంబులెన్స్ను అందుబాటులో ఉంచాలి
చెరువులు, కుంటలు తెగిపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలి
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు
జిల్లా కలెక్టర్ అభిలాషా అభినవ్
మహబూబాబాద్, జూలై 22 : భారీ వానలు కురుస్తున్న నేపథ్యంలో వర్ష బాధితులు ఆపద సమయంలో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్లెడ్ కంట్రోల్ రూమ్ను వినియోగించుకోవాలని కలెక్టర్ అభిలాషా అభినవ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున అన్ని మండలాల్లో గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం, ఇతర వసతులు సమకూర్చాలని తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారికి అన్ని రకాల సేవలు అందించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లాలో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు ప్రయాణాలు చేయొద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. చెరువులు, కుంటలు తెగిపోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల ఇబ్బందులు పడేవారు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 08719-24044 0, 298526, వాట్సాప్ నంబర్ 7995074803లో సంప్రదించాలని సూచించారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, ట్రెయినీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ కొమురయ్య, ఇంజినీరింగ్, వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
కలల సాకారానికి నిరంతరం కృషి చేయాలి
విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకుని సాకారానికి నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ అభిలాషా అభినవ్ సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి వివిధ కళాశాలల్లో సీట్లు పొందిన 24 మంది విద్యార్థులకు అడ్మిషన్ పత్రాలు అందించి అభినందించారు. సాంఘిక సంక్షేమ స్కూల్లో విద్యనభ్యసించి కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో 62 మంది ఎంపిక కాగా, అందులో 24 మంది ఉచిత విద్యకు ఎంపికవడం మంచి పరిణామమన్నారు. నిరుపేద విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలని ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారి రావూరి రాజు, అధికారులు పాల్గొన్నారు.
హరితహారం లక్ష్యాలను సాధించాలి
జిల్లాలో హరితహారం లక్ష్యాలను సాధించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 69 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. శ్మశానవాటిక, సెరిగ్రేషన్ షెడ్లలో విరివిగా మొక్కలు నాటి బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో ఎకరానికి 31 వేల మొక్కలు నాటాలని సూచించారు. డీఆర్డీఏ ద్వారా నాటేందుకు అటవీశాఖ అధికారులు మొక్కలను సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ను కలిసిన డీఈవో సోమశేఖర్ శర్మ
మహబూబాబాద్ రూరల్: నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అభిలాషా అభినవ్ను డీఈవో సోమశేఖర్శర్మ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, ఆన్లైన్ తరగతులు, విద్యార్థుల ప్రవేశాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఏడీ రాజేశ్వర్, మందుల శ్రీరాములు, ముఖేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.