కుతుబ్షాహీ వంశంలో చివరి రాజు అబుల్హసన్ తానీషాపై ఔరంగజేబు కన్నుపడింది. ఔరంగజేబు బీజాపూరు రాజ్యాన్ని జయించిన తర్వాత 1687లో గోల్కొండ మీద దండెత్తాడు. ఎనిమిది నెలల యుద్ధం తర్వాత ఒక గోల్కొండ సేనాని చేసిన ద్రోహంతో కోటను వశపర్చుకున్నాడు. తానీషాను దౌల్తాబాద్ తీసుకెళ్లి అక్కడి కోటలో బంధించాడు. దీనితో దాదాపు 200 ఏండ్ల కుతుబ్షాహీల పాలన అంతమైంది.
పూర్వం కాకతీయ రాజుల కాలంలో ఆంధ్రదేశం అంతా ఏకఛత్రాధిపత్యం కిందకు మొదటిసారి వచ్చినట్లుగా.. రెండవసారి కుతుబ్షాహీల కాలంలో ఆంధ్రదేశం అంతా ఏకఛత్రం కిందకు వచ్చింది. ఆ విధంగా కుతుబ్షాహీల పాలన ఒక స్వర్ణయుగాన్ని తలపించింది.
అద్దంకి గంగాధరుడు ‘తపతీ సంవరణోపాఖ్యానం’ అనే ప్రబంధాన్ని రచించి ఇబ్ర హీం కుతుబ్షాకు అంకితం ఇచ్చాడు. ఇబ్రహీం విజయనగరంలో ఉన్నప్పుడే గంగాధర కవితో అతడికి పరిచయమైంది. ఇబ్రహీంతో పాటు గంగాధరుడు కూడా క్రీ.శ.1550లో గోలకొండకు వచ్చాడని చెప్తారు. గంగాధర కవి విజయనగరంలో ఉన్నప్పుడే అక్కడి కవుల ప్రబంధాల చేత ప్రభావితుడైనాడు. దాంతో అతడు అష్టాదశ వర్ణనలతో కూ డిన ప్రబంధాన్ని రచించి ఇబ్రహీంకు అంకితంగా ఇచ్చాడు. ఇబ్రహీం కుతుబ్షా గంగాధరుడి ప్రబంధానికి పూర్వమే అనేకమంది కవులు రచించిన కావ్యాలను అంకితంగా పొందినట్లుగా ‘తపతీ సంవరణో పాఖ్యానం’ పీఠిక ఆధారంగా తెలుస్తున్నది.
మహాభారతం ఆదిపర్వంలోని తపతి, సంవరణుల కథను తీసుకొని ఐదు ఆశ్వాసాలు ప్రబంధంగా గంగాధర కవి రచించాడు. అతని శైలి ధారాళంగా ఉంది. శబ్దాలంకారాలు రమ్యంగా ఉన్నాయి. కథా కల్పనలు, పాత్రల వర్ణనలు చక్కగా ఉన్నాయి. నన్నయ ‘తెలుగు భారతం’లో తపతీ, సంవరణుల కథ 23 పద్య గద్యాలలో ఉన్నది. అంత చిన్న కథను తీసుకొని గంగాధర కవి రమ్యమైన కల్పనలతో శృంగార ప్రధానమైన ప్రబంధంగా రచించాడు.
గంగాధర కవి రామరాజ భూషణుని ‘వసుచరిత్ర’ రచనతో చాలా ప్రభావితు డైనాడు. ‘శృంగార నైషధం’లో నాయికా నాయకుల మధ్య హంస రాయబారం నడుపుతుంది. గంగాధరుని కావ్యం లో ఆ విధంగానే ఒక చిలుక రాయబారాన్ని నడుపుతుంది. ఇబ్రహీం కుతుబ్షా విజయనగరంలో ఉన్నప్పుడే కవి ఈ కావ్యాన్ని రచించాడని గోలకొండకు వచ్చిన తర్వాత దాన్ని కుతుబ్షాకు అంకితంగా ఇచ్చాడని చెప్పవచ్చు.
పొన్నగంటి తెలగన కవి ‘యయాతి చరిత్ర’ను రచించి ఇబ్రహీం కుతుబ్షా కాలంలో మెదకు జిల్లాలోని పొట్లచెరువు (నేటి పటాన్ చెరువు) పాలకుడైన అమీన్ఖాన్కు అంకితంగా ఇచ్చాడు. దీని రచనా కాలం క్రీ.శ. (1576-80). యయాతి చరిత్ర అచ్చ తెనుగులో రచించిన కావ్యం. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యం. సంస్కృత భాషా పదాలను దేశీ, తద్భవ పదాలను మాత్రమే ప్రయోగించి కవి ఈ కావ్యాన్ని రచించాడు. సంస్కృత పదాలను అచ్చ తెనుగు పదాలుగా తయారు చేసుకున్నాడు. ఉదాహరణకు.. పంచవదనుడు= ఐదు మోముల వేల్పు, వాల్మీకి= కనువినుకలి తావుచూలి, బ్రహ్మ= నీటి పుట్టువు, పట్టి ఇంకా.. పక్కడాలు, వేల్పు, పొక్కిలి, పసిబిడ్డ, హిమవంతుడు= మరుమేపు కందోక మామగారు అని ఈ విధంగా అచ్చతెనుగు పదాలను తయారు చేసుకొని ‘తెలగన’ అనే కవి అచ్చమైన తెలుగులో రచించాడు. తెలగన తర్వాత అతన్ని అనుకరిస్తూ చాలా అచ్చతెనుగు కావ్యాలు రచింపబడినాయి. అతని పేరే తెలగన అంటే.. అచ్చతెనుగు కావ్యం రాయడం వల్ల అతడికాపేరు వచ్చిందా తెలియదు. తెలంగాణ నుంచి ఒక నూతన ప్రక్రియ అచ్చతెనుగు కావ్య రచన అనేది ప్రారంభమైంది. అచ్చ తెనుగు కావ్యం రాసి ఒక ముస్లిం పాలకుడికి అంకితం ఇవ్వటం ఒక వింత సంయోగంగా కన్పిస్తున్నది. తెలగన విస్తారంగానే ‘యయాతి చరిత్ర’ను రచించాడు. ప్రబంధ వర్ణనలు చేశాడు. పాల్కుర్కి సోమన తన శతకంలో ఒక అచ్చతెనుగు పద్యాన్ని రచించాడు. అచ్చతెనుగులో ఆ తర్వాత కాలంలో కావ్యాలు కూడా రచింపబడినాయి. నిజానికి అచ్చతెనుగులో ఒక్క పద్యం రాయటమే కష్టం. అటువంటిది మొత్తం కావ్యాన్ని రచించటం అనేది అరుదైన విషయమే. కవి దాన్ని ఇట్లా చెప్పుకున్నాడు.
‘మున్నెవ్వరు నొడవని యీ తెన్నుడి
కడుమీరి యచ్చ తెనుగుం గుబ్బం
తెన్నిక మీరగజెప్పిన నిన్నుం బొగడంగ
గలడె వెల తాల్పయినన్ ’
అచ్చ తెనుగు కావ్యాలలో దీర్ఘసమాసాలు, పరుషాక్షరాలు లేకపోవడంతో శైలి మృదుమధురంగా ఉంటుంది. కానీ పాఠకులు ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకోవడం కష్టమై కావ్యాన్ని చదవడం మెల్లగా సాగుతుంది. అచ్చ తెనుగు కావ్యరచన తెలుగులో ఒక ప్రక్రియగా రూపొందింది. అచ్చతెనుగు పదాల నిఘంటువులు కూడా కూర్చబడినాయి. ఈ ప్రక్రియ గంభీర రూపంగానే బయలుదేరి వ్యాప్తి చెందింది. అచ్చ తెనుగునే ‘శుద్ధాంధ్రం’ అని అన్నారు. అచ్చ తెనుగులో కావ్యం రాయడం శివకవుల దేశీకవితా ఉద్యమంలోని జానుతెనుగు ప్రయోగ ఫలితమే అని చెప్పాలి. ఆ తర్వాత కాలంలో కూచిమంచి తిమ్మకవి (క్రీ.శ.18వ శతాబ్దం), ములుగు పాపయదాధ్యుడు, మరింగంటి వెంకట నరసింహాచార్యులు మొదలైన కవులు అచ్చతెనుగు కావ్యాలను రచించారు.
–ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606