యావత్ ఆంధ్రదేశాన్ని, దక్షిణాపథాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన వారు కాకతీయ రాజులు. వారు నిర్మించిన ఆలయాలు, తవ్వించిన చెరువులు, చేసిన దానధర్మాలకు అంతులేదు. వారి బాటలోనే వారి సామంత మాండలికులు కూడా పయనించారు. కాకతి గణపతిదేవుని కాలంలో సామంతులైన కాయస్థ వంశీయుల కాలంలో వేయించబడిన ఒక శాసనం నల్లగొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో లభించింది. శాసనం వేయించినవాడు గంగయ సైన్యనాథుడు. శాసన కాలం శక సంవత్సరం 1173 = క్రీ.శ. 1251. విరోధికృత్ వైశాఖ అమావాస్య.
కాకతీయ ప్రోలరాజు మొద లు గణపతి దేవుని వరకు వంశక్రమాన్ని శాసన ప్రారం భం తెలియజేస్తుంది. కాకతి వంశ తిలకుడు, కులవర్ధనుడిగా పేర్కొనబడిన ప్రోలరాజు అనంత గుణ ప్రవీణుడిగా చెప్పబడినాడు. ఇతడు తన సోదరుడి కుమారుడికి రక్షణ కల్పించి, అతడిని ఉదయ క్షితిపతి గా నిలబెట్టినాడు. ఇతడి కుమారుడు మహాదేవరాజు. ఇతడు ప్రకట సాహస చుంచురాసీద్ధర్మ, గుణనిధి అని కీర్తించబడ్డాడు. అతని తరువాత గణపతిదేవుడు పేర్కొనబడినాడు.
కాయస్థ వంశానికి చెందిన ధన్వ యొక్క కుమారుడు జసువ పండితుడు. ఇతడు ప్రకట ప్రతాప, సత్యాన్విత బలయుతుడు, క్షితిదేవభర్త, యుక్త శ్రియావిబుధ సంస్తుతుడు, శాంతమూర్తిగా చెప్పబడినాడు. ఇతని కుమారుడు గంగయ సైన్యనాథుడు. ఇతడు గొప్పగా వర్ణించబడినాడు.
శౌర్య ప్రతాప గుణైక భూషణుడు.. తన భుజబల ప్రభావంచే దక్షిణతీరం వరకు (ఆదక్షిణాబ్ధే) జయించిన గంగయ తనకు, తన తల్లిదండ్రులకు ధర్మార్థంగా మేఖల తీర్థంలోని సారంగిదేవుడు (విష్ణువు), నృసింహదేవుడు, దైత్యసూద దేవుళ్ళ భోగార్థం కొత్తపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినాడు.
శాసనంలో మేఖల తీర్థం విశిష్టత చెప్పబడింది. ‘భూమిమీద దండకారణ్యంలో మేఖలాతీర్థం నిర్మించబడింది. అక్కడ ఉన్న శార్గపాణి, మురారి దేవుళ్ళను చూస్తే నరులకు ముక్తి లభిస్తుంది.
అక్కడి శుక్ల తీర్థంలో స్నానం చేయడం వలన గోవులవలె పవిత్రులవుతారు. చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఈవిధంగా బ్రహ్మచేత చెప్పబడిన ఈ మేఖలతీర్థం తెల్లని కపిలగోవు స్వరూపంగా ఉంది. ఈ మేఖల తీర్థం లో స్నానం చేయడం శుక్లతీర్థంలో స్నానం చేసినట్లుగా స్వచ్ఛమైనవారుగా మారుతారు.
శాసనంలో చివరగా మునిధామార్య అనే అతడు స్థానపాలుడుగా నియమించబడినట్లుగా ఉంది. ఇతడు ఆయా దేవాలయాల నిర్వహణ చూసేవాడుగా చెప్పవచ్చు. దేవునికి సమర్పించిన 40 గ్రామాలు, ఆదా యం చూసే బాధ్యత మునిధామార్యుడిదిగా చెప్పబడింది. ఇంకా పలువురికి వ్యక్తిగతంగా భూదానం చేసినట్లుగా కూడా శాసనంలో ఉంది.
చెరువు, లేదా కాలువ నిర్మించారంటే అది పెద్ద నది లేదా సముద్రంతో సమానంగా చెప్పడం, దానిలో స్నానాదులు నిర్వహిస్తే పాపాలు నశిస్తాయనే నమ్మకం ఈ శాసనాన్ని అధ్యయనం చేస్తే తెలుస్తుంది.
–డాక్టర్ భిన్నూరి మనోహరి
93479 71177